Actor Darshan: దర్శన్ కేసుపై పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్.. ఏం చెప్పారంటే..

|

Jun 18, 2024 | 1:47 PM

మంగళవారం రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు పోలీస్ కమిషనర్ బి.దయానంద్. ఇప్పటి వరకు 17 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు పోలీసు కమిషనర్. నిందితుడిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని.. ఈ కేసు దర్యాప్తును ఏసీపీ స్థాయి అధికారికి అప్పగించినట్లు తెలిపారు.

Actor Darshan: దర్శన్ కేసుపై పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్.. ఏం చెప్పారంటే..
Darshan
Follow us on

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్‏కు ఉచ్చు బిగుస్తుంది. ఈ కేసులో ఇప్పటివరకు అనేక సంచలనాలు బయటకు వచ్చాయి. దర్శన్ తోపాటు నటి పవిత్రగౌడ, మరో 15 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు బెంగుళూరు పోలీసులు. ఈ క్రమంలో మంగళవారం రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు పోలీస్ కమిషనర్ బి.దయానంద్. ఇప్పటి వరకు 17 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు పోలీసు కమిషనర్. నిందితుడిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని.. ఈ కేసు దర్యాప్తును ఏసీపీ స్థాయి అధికారికి అప్పగించినట్లు తెలిపారు.

ప్రతి అంశాన్ని విచారించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని.. దర్యాప్తు బృందంలో పలువురు ఇన్‌స్పెక్టర్లు, సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. దీంతో పాటు సాక్ష్యాధారాల సేకరణలో సహకరించేందుకు ఎఫ్‌ఎస్‌ఎల్‌ నిపుణులు, సాంకేతిక నిపుణులు ఉన్నారని.. కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు నిష్పక్షపాతంగా, నిజాయితీగా విచారణ జరుపుతున్నారన్నారు.

రేణుకాస్వామి హత్యకు సంబంధించి ఆధారాలు సేకరించామని.. ఇది హేయమైన చర్య అని, నిందితులకు శిక్ష పడేలా చూస్తామని.. హత్యకు గురైన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేసేలా చూస్తామని కమిషనర్ అన్నారు. మీడియా సహనం, మద్దతు ఈ కేసును మరింత ముందుకు తీసుకెళ్లడానికి అవసరమని.. కోర్టులో విచారణ, అలాగే సాక్షులు కూడా ముఖ్యమని అన్నారు. రేణుకాస్వామి కేసుకు సంబంధించి సర్వత్రా సోదాలు జరుగుతున్నాయి. చిత్రదుర్గ, మైసూర్‌లలో కూడా ఒక్కో దర్యాప్తు బృందం ఉంది. పశ్చిమ డివిజన్ డీసీపీ గిరీష్ అంతా పర్యవేక్షిస్తున్నారు. ప్రతి బృందానికి ఒక ఇన్‌స్పెక్టర్ నేతృత్వం వహిస్తారు. ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడే చెప్పలేనని కమిషనర్ దయానంద తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.