గత కొన్నేళ్లుగా అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్ ల హవా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్లో మరో క్రీడాకారిణి బయోపిక్కు రంగం సిద్ధమైంది. ఒలింపిక్స్ మహిళా విభాగంలో ఇండియాకు ఫస్ట్ మెడల్ అందించిన వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి జీవిత కథను త్వరలో వెండితెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ రోజు ఆమె బర్త్ డే సందర్భంగా చిత్ర పోస్టర్ను రిలీజ్ చేసి, అధికారిక ప్రకటన చేశారు.
ఈ సినిమాను సంజనా రెడ్డి తెరకెక్కించబోతున్నారు. ఎమ్వీవీ సత్యనారాయణ, కోన వెంకట్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేయనున్నారు. ఇందులో మల్లేశ్వరి పాత్ర ఎవరు చేయబోతున్నారు?, ఇతర టెక్నికల్ టీమ్ వివరాలు తెలియాల్సి ఉంది. దీనిని పాన్ఇండియా మూవీగా పలు భాషల్లో తెరకెక్కించనున్నారు.
ఒలింపిక్స్లో ఇండియా తరఫున రెండుసార్లు బరిలోకి దిగిన మల్లేశ్వరి.. 1998 బ్యాంకాక్లో జరిగిన పోటీల్లో 63 కిలోల విభాగంలో రజతం, 2000లో సిడ్నీలో జరిగిన పోటీల్లో కాంస్యం పతకం గెల్చుకున్నారు. 1995లో చైనా, గ్వాంగ్జూలో జరిగిన వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ టోర్నీలో 54 కిలోల విభాగంలో మూడు స్వర్ణాలు గెలుపొందారు. వెయిట్ లిఫ్టింగ్లో మల్లేశ్వరి చేసిన కృషికిగానూ..ఆమెను అర్జున అవార్డు, రాజీవ్ ఖేల్రత్న, పద్మశ్రీ పురస్కారాలతో సత్కరించింది భారత ప్రభుత్వం.