AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెరిసే చర్మ రహస్యాన్ని రివీల్ చేసిన గ్లోబల్ బ్యూటీ..! మొటిమలు, డార్క్ సర్కిల్స్‌ ఇక పరుగే

బాలీవుడ్ దేశీ గర్ల్‌గా కెరీర్ ప్రారంభించి, నేడు గ్లోబల్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ ఐకాన్‌గా ఎదిగిన ప్రియాంకా చోప్రా అందం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' చిత్రంలో నటిస్తున్న ఆమె, నిత్యం బిజీగా ఉన్నా తన చర్మం ఎప్పుడూ తాజాగా, మెరుస్తూ ఉండేలా జాగ్రత్త పడుతుంటారు.

మెరిసే చర్మ రహస్యాన్ని రివీల్ చేసిన గ్లోబల్ బ్యూటీ..! మొటిమలు, డార్క్ సర్కిల్స్‌ ఇక పరుగే
Priyanka Jones Chopra
Nikhil
|

Updated on: Apr 12, 2026 | 6:30 AM

Share

ప్రియాంక తన స్కిన్ కేర్ రహస్యాలను తరచుగా అభిమానులతో పంచుకుంటూనే ఉంటారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఆమె తన ముఖ సౌందర్యం కోసం ‘ఫేషియల్ కోల్డ్ ప్లంజ్’ అనే వినూత్న పద్ధతిని పాటిస్తూ కనిపించారు. ఈ చిట్కా వెనుక ఉన్న సైన్స్ ఏంటి? దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

ఫేషియల్ కోల్డ్ ప్లంజ్ అంటే..

సాధారణంగా చాలామంది ఒక గిన్నెలో ఐస్ ముక్కలు వేసి, ఊపిరి బిగబట్టి ముఖాన్ని అందులో ఉంచుతారు. కానీ ప్రియాంక చోప్రా ‘ద ఫేస్‌టబ్’ అనే ఒక ప్రత్యేక పరికరాన్ని ఉపయోగించారు. దీనికి ఒక బ్రీతింగ్ అటాచ్‌మెంట్ ఉంటుంది. దానిని నోటిలో ఉంచుకోవడం వల్ల ముఖం పూర్తిగా చల్లటి నీటిలో ఉన్నప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్వాస తీసుకోవచ్చు. ప్రియాంక ఎంతో అసౌకర్యం లేకుండా ఈ ప్రక్రియను రెండు సార్లు పూర్తి చేసి తన చర్మాన్ని రీఫ్రెష్ చేసుకున్నారు.

చల్లటి నీళ్లు చర్మంపై పడగానే రక్తనాళాలు కుచించుకుపోయి, రక్తప్రసరణ ఒక్కసారిగా పెరుగుతుంది. దీనివల్ల చర్మానికి ఆక్సిజన్, పోషకాలు సమృద్ధిగా అందుతాయి. ఫలితంగా ముఖం సహజమైన కాంతితో మెరుస్తుంది. అంతేకాకుండా, ఉదయం లేవగానే చాలామందికి ముఖం ఉబ్బినట్లుగా లేదా కళ్ల కింద వాపు కనిపిస్తుంది. ఐస్ వాటర్ చర్మం కింద పేరుకుపోయిన అదనపు ద్రవాలను తొలగించి, ముఖాన్ని సరైన షేప్‌లో ఉంచడానికి సహాయపడుతుంది. ఇది మేకప్ వేసుకునే ముందు ఒక అద్భుతమైన ప్రైమర్‌లా కూడా పనిచేస్తుంది.

మొటిమల నియంత్రణ

చల్లటి నీరు తగిలిన వెంటనే చర్మ రంధ్రాలు బిగుతుగా మారుతాయి. దీనివల్ల దుమ్ము, ధూళి లోపలికి చేరవు, తద్వారా మొటిమలు వచ్చే అవకాశం తగ్గుతుంది. మొటిమల వల్ల కలిగే ఎరుపుదనం, మంటను తగ్గించడంలో కూడా ఇది మేలు చేస్తుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ముఖాన్ని ఐస్ వాటర్‌లో ఉంచడం వల్ల శరీరంలోని ‘వేగస్ నర్వ్’ ఉత్తేజితమవుతుంది. ఇది మనసును ప్రశాంతంగా ఉంచి ఒత్తిడిని, ఆందోళనను తగ్గించడానికి తోడ్పడుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఒక గిన్నెలో ముప్పావు వంతు నీరు, ఐస్ క్యూబ్స్ నింపి, ముఖాన్ని 5 నుండి 10 సెకన్ల పాటు అందులో ముంచాలి. ఇలా రెండు మూడు సార్లు చేసిన తర్వాత మెత్తటి టవల్‌తో తుడుచుకుని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అయితే, సున్నితమైన చర్మం లేదా రోసేసియా వంటి సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించిన తర్వాతే ఇది ప్రయత్నించాలి. అలాగే, ముఖాన్ని ఒకేసారి ఎక్కువ సేపు నీటిలో ఉంచకూడదు. పరిశుభ్రమైన నీరు, ఐస్ వాడటం అత్యంత ముఖ్యం. ప్రకృతి సిద్ధమైన ఈ చిన్న చిట్కాతో మీరు కూడా ప్రియాంక లాంటి మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.

Follow Us