టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, మనోజ్లు ఒకే సంవత్సరం, ఒకే రోజు, కొన్ని గంటల వ్యవధిలో పుట్టిన విషయం తెలిసిందే. ఇక ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడగా.. ఆ తరువాత మంచి స్నేహితులుగా మారారు. కాగా మనోజ్ చేసే అల్లరి పనుల కారణంగా ఎన్టీఆర్ చాలాసార్లు ఇంట్లో ఇబ్బందులు పడేవారట. ఇదిలా ఉంటే తామిద్దరం ఈ భూమ్మీదకు ఎలా వచ్చారన్న విషయంపై తారక్, మనోజ్కి ఎప్పుడూ ఓ స్టోరీ చెప్పేవారట.
అదేంటంటే.. ఓసారి దీర్ఘంగా ఆలోచించిన బ్రహ్మ, రెండు బొమ్మలను తయారుచేశాడట. అందులో ఒకటి కొంచెం తెల్లగా, మరొకటి కొంచెం నల్లగా, ఒక బొమ్మకు రింగుల జుత్తు, మరో బొమ్మకు సిల్కీ హెయిర్. ఇలా కొన్ని మార్పులతో ఆలోచనా విధానం మాత్రం ఒకేలా ఉండేలా రెండు బొమ్మలను తయారు చేశాడట. ఇక ఆ రెండు బొమ్మలకు ఓ పరీక్ష పెట్టాడట. అందులో ఓ బొమ్మ ఎలాంటి అల్లరి చేయకుండా వినయంగా ఉందట. దీంతో ఆ బ్రహ్మ దేవుడు, ఈ బొమ్మ చాలా పద్ధతిగా ఉంది కాబట్టి.. దాన్నే ముందు భూమ్మీదకి పంపారట. అది ఎన్టీఆర్నట. అయితే అది గమనించిన రెండో బొమ్మ.. మా ఇద్దరిని ఒకేసారి తయారు చేసి, వాడిని ఎందుకు ముందుగా భూమ్మీదకు పంపిస్తారని బ్రహ్మను గట్టిగా గిల్లాడట. దాంతో బ్రహ్మ.. నన్ను ఇంత ఇబ్బంది పెట్టిన ఈ బొమ్మ తప్పుకుండా మోహన్ బాబు ఇంట్లో పుట్టాలని అక్కడ పుట్టించారట. ఆ బొమ్మనే మనోజ్నట. ఈ స్టోరీని ఎప్పుడూ మనోజ్కి చెప్పే ఎన్టీఆర్.. మనోజ్ పుట్టినప్పటి నుంచే తనకు టార్చర్ ప్రారంభమైందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘వాడు వస్తున్నాడంటే నాకు ప్రకృతి ముందుగానే హెచ్చరిస్తుంది. నేను మనోజ్ కంటే కొన్ని గంటల ముందు పుట్టాను. అయినా నాకు ఎలాంటి గౌరవం ఇవ్వడు. ఏరా, ఏంట్రా అని పిలుస్తూ ఉంటాడు’ అని మనోజ్ గురించి చెప్పుకొచ్చారు ఎన్టీఆర్. కాగా ఈ ఇద్దరు బుధవారం 27వ పుట్టినరోజును జరుపుకున్నారు.