
ఈ టెక్నాలజీ యుగంలో ఏది నిజమో… ఏది అబద్ధమో… నమ్మడమే కష్టంగా ఉంది. తిమ్మిని బమ్మి చేస్తున్న కేటుగాళ్లు.. సెల్రబిటీల కళ్లలో నలుసుగా మారుతున్నారు. వారు చేస్తున్న తింగరి చేష్టలకు… సినీ స్టార్స్ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడీ జాబితాలో నటి రుక్మిణి వసంత్ కూడా చేరారు. ఆమెకు సంబంధించిన ఫేక్ వీడియోలు, ఫొటోలు వైరల్ కావడం కలకలం రేపుతోంది. అయితే, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు హీరోయిన్ రుక్మిణి వసంత్. అవి ఏఐ టెక్నాలజీతో సృష్టించిన ఫేక్ చిత్రాలని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో స్పష్టం చేశారు. ఇది కచ్చితంగా, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేననీ.. బాధ్యులపై లీగల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గ్రీన్ బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్లోకి వెళుతున్నట్లుగా ఉన్న ఓ మహిళ ఫొటోలు, వీడియో క్లిప్లు ఆన్లైన్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. చాలామంది నెటిజన్లు ఇది రుక్మిణి వసంత్ ‘మొదటి బికినీ షూట్’ అంటూ ప్రచారం చేయడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో అలెర్టయిన రుక్మిణి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా దీనిపై పూర్తి వివరణ ఇచ్చారు. ఇలాంటి తప్పుడు కంటెంట్ను షేర్ చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
My team and I have come across certain AI-generated images being circulated online claiming to be me.
I want to state clearly that these images are entirely fake and fabricated.
The creation and circulation of such manipulated content is deeply irresponsible and a serious… pic.twitter.com/8iitXTvFvT
— rukmini (@rukminitweets) May 23, 2026
ప్రస్తుతం యశ్తో ‘టాక్సిక్’, జూనియర్ ఎన్టీఆర్తో ‘డ్రాగన్’ సినిమాల్లో నటిస్తున్న రుక్మిణి.. సంప్రదాయ బద్ధంగా ఉంటుందనే ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. అయితే, సడెన్గా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలు ఒక్కసారిగా ఆమెను షాక్కు గురిచేశాయి. దీంతో బికినీ ఫోటోషూట్ ఫేక్ చిత్రాలపై తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వార్నింగ్ ఇచ్చారు.
అయితే, ఈవెంట్స్లో ఫొటోగ్రాఫర్స్… హీరోయిన్లను అసభ్యకర కోణాల్లో ఫొటోలు తీయడాన్ని గతంలోనే తప్పుబట్టారు రుక్మిణి. తమ శరీర భాగాల్ని జూమ్ చేసి ఫొటోలు తీయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు . అయితే ఇప్పుడు ఆవిడకు సంబంధించి అసభ్యకర ఫేక్ ఫొటోలు, వీడియోలే వైరల్ కావడం చర్చనీయాంశమవుతోంది.
అయితే, ఫేక్ వీడియోల ఉదంతం.. కొత్తదేం కాదు. పెరుగుతున్న టెక్నాలజీని అడ్డదిడ్డంగా వాడేసుకుంటున్న కొందరు ఆకతాయిలు… సెలబ్రిటీలే లక్ష్యంగా AI డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోలు క్రియేట్ చేసి.. సోషల్ మీడియాలోకి వదులుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ మొదలు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వరకు.. ఎంతో మంది స్టార్స్ ఈ AI డీప్ ఫేక్ వీడియోల బాధితులే. AI టెక్నాలజీ ఉపయోగించి, చేయని వాటిని చేసినట్టు చూపిస్తున్నారు కేటుగాళ్లు. సెలబ్రిటీల ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా, అసభ్యకరమైన వీడియోలను సృష్టిస్తున్నారు. దీంతో స్టార్స్కి టెన్షన్ తప్పడం లేదు. దీన్ని కంట్రోల్ చేసేందుకు.. కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త మార్గదర్శకాలను ప్రతిపాదించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..