తమిళ్లో ఘన విజయం సాధించిన ‘రాట్షసన్’ను బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెలుగు రీమేక్లో చేస్తున్నారు. రమేశ్ వర్మ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్గా రాశి ఖన్నా ఫైనల్ అయినట్లు వార్తలు రాగా.. తాజాగా మరో భామ లైన్లోకి వచ్చింది. ఈ మూవీ కోసం మలయాళ కుట్టీ అనుపమ పరమేశ్వరన్ను సంప్రదించినట్లు తెలుస్తోంది.
మాతృకలో నటించిన అమలా పాల్ టీచర్ పాత్రలో కనిపించగా.. ఆ పాత్రకు అనుపమ న్యాయం చేయగలదని భావించిన నిర్మాతలు ఆమెను సంప్రదించినట్లు టాక్. కథను విన్న అనుపమ ఇందులో నటించేందుకు ఒప్పుకుందని కూడా సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా కెరీర్ ప్రారంభంలో వరుస హిట్లు కొట్టిన అనుపమ, ఆ తరువాత పరాజయాలతో కాస్త వెనుకబడింది. ఇప్పుడు ఈ వార్త నిజమైతే ఆమెకు మంచి అవకాశం దక్కినట్లే.