
కల్తీ కల్లు.. హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో 9 మందిని బలితీసుకుంది. దీంతో నిద్రలేచిన ఎక్సైజ్ శాఖ ఎక్కడికక్కడ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో షాకింగ్ నిజాలు వెలుగుచూస్తున్నాయి. మేడ్చల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్యాకెట్లలో కల్లు విక్రయిస్తున్నారు. SV బ్రాండ్ పేరుతో పాల ప్యాకెట్ తరహాలో జోరుగా విక్రయాలు జరుపుతున్నారు. కండ్లకోయ, అయోధ్య నగర్, గుండ్లపోచంపల్లి పరిసర ప్రాంతాల్లో చాప కింద నీరులా కల్లు ప్రవహిస్తోంది.
ఇప్పటి వరకు మనకు పాల ప్యాకెట్లు, నూనె ప్యాకెట్లు, ఆపై సారా ప్యాకెట్లూ తెలుసు. ఇప్పుడు కొత్త కల్లు ప్యాకెట్లు చూస్తున్నాం. ఇప్పుడు కల్లు ప్యాకెట్లు చూస్తున్నాం. కొత్తగా ఈ కల్లు ప్యాకెట్లు వస్తుండటం చూసి జనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్ పోలీసులు దాడులు తీవ్రతరం చేయడంతో కల్తీ కల్లు రాయుళ్లు కొత్త దారులు ఎంచుకున్నారు. పాల ప్యాకెట్లను మించిన ప్యాకింగ్తో అద్భుతమైన బ్రాండింగ్తో సరికొత్తగా కల్లు ప్యాకెట్లను తీసుకొచ్చారు. సీసాల్లో నింపి సిట్టింగ్ వేసి తాగేసరికి సమయం పడుతుందనుకున్నారో ఏమో.. ఇన్స్టాంట్గా మజ్జిగ ప్యాకెట్ల తరహాలో కల్లు ప్యాకెట్లను మార్కెట్లోకి దించేశారు.
నిబంధనలకు విరుద్ధంగా ప్యాకెట్లలో నింపి కల్లు విక్రయిస్తున్నారు విక్రేతలు. ఎలాంటి అనుమతులు లేకుండా పాల మాదిరి ప్యాక్ చేసి కల్లు విక్రయిస్తున్నారు. రెండు రోజుల క్రితం దాడులు చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
చెట్లనుంచి తీసేదంతా కల్లేగానీ తాగేదంతా కల్లుకాదు. తెల్లనివన్నీ పాలు కానట్లే నురుగు కక్కేదంతా కల్లు కానే కాదు. కల్తీ చేయడం కాదు.. రసాయనాలు కలిపి కృత్రిమంగా తయారుచేస్తున్నారు. దానికి అలవాటు పడ్డ ప్రాణాలు ఆ మత్తునుంచి బయటపడలేకపోతున్నాయి. ప్రాణాంతకమని తెలిసినా డ్రగ్స్లాంటి ఆ మత్తుకి అలవాటుపడుతున్నారు. ఆరోగ్యాలు గుల్ల చేయడమే కాదు..ప్రాణాలే పోతున్నాయి.
హైదరాబాద్తోపాటు, శివార్లలో కల్తీకల్లు బంద్ కావడంతో పేషెంట్లుగా మారుతున్నారు బాధితులు. కల్లు దొరక్క విలవిల్లాడిపోతున్నారు. సూరారం జీడిమెట్లలో విత్డ్రాల్ సింప్టమ్స్తో పలువురు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఫిట్స్, కళ్లు తిరగడం వంటి లక్షణాలతో అపస్మారక స్థితిలోకి బాధితులు వెళ్తున్నారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆస్పత్రుల్లో వీరికి చికిత్స కొనసాగుతోంది.