కొమరంభీం జిల్లాలో ప్లాస్టిక్ బియ్యం కలకలం.. అన్నం పూర్తిగా మాడిపోవడంతో పలు అనుమానాలు
కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామంలో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపింది. పూలాజి బాబా ఆశ్రమం వద్ద అన్నదాన కార్యక్రమంలో ప్లాస్టిక్ బియ్యం బయటపడింది.
Plastic Rice Crisis: కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామంలో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపింది. పూలాజి బాబా ఆశ్రమం వద్ద అన్నదాన కార్యక్రమంలో ప్లాస్టిక్ బియ్యం బయటపడింది. అన్నం పూర్తిగా మాడిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
వాటిని పరిశీలించిన స్థానికులు ప్లాస్టిక్ బియ్యంగా అనుమానాలను వ్యక్తం చేశారు. అయితే అప్పటికే కొంతమంది అన్నం తినడంతో వారు ఆందోళనకు గురయ్యారు. ప్లాస్టిక్ రైస్ను తిన్న తమకు ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయోనన్న కలవరం వారిలో కనిపించింది.
ఇలాంటి ప్లాస్టిక్ బియ్యాన్ని అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ప్లాస్టిక్ బియ్యం బయటపడడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా అనేక సార్లు ప్లాస్టిక్ బియ్యం బాగోతం వెలుగుచూసింది. చైనా ప్లాస్టిక్ రైస్గా వీటికి పేరుంది. అయితే ఇవి నిజంగా ప్లాస్టిక్ రైసేనా.. ఎంత వరకు నిజమన్న దానిపై గతంలో అధికారులు అనేక సార్లు పరీక్షించారు.
ప్లాస్టిక్ అని ఎక్కడా బయటపడనప్పటికీ.. పాడైపోయిన బియ్యాన్ని పాలిషింగ్ చేసి అమ్ముతున్నారని ఓసారి గుర్తించారు అధికారులు. ఆదిలాబాద్లోనే ఇటీవల రేషన్ సరుకుల్లో ప్లాస్టిక్ బియ్యం వచ్చినట్టు కొందరు గ్రామస్తులు తెలిపారు. కాల్చితే బియ్యం నల్లబడినట్టుగా వారు వేంపల్లిలోని రేషన్షాపు ఎదుట ఆందోళనకు దిగిన సందర్భాన్నీ చూశాము.
తాజాగా కొమరంభీం జిల్లాలోనే మరోమారు ఇలాంటి బియ్యం బయటపడడం చర్చనీయాంశంగా మారింది. ఈ జిల్లాకు సరఫరా అవుతున్న బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయో.. ఇలా నల్లబడడానికి కారణం ఏంటో తేల్చాలని ప్రజలు కోరుతున్నారు. బియ్యం మాడిపోతున్న సందర్భాలు తరచూ బయటపడుతుండడంతో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని ఈ సమస్యకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.