కశ్మీర్‌లో ఢిల్లీ తరహా ఘటన.. పెళ్లికి నిరాకరించిందని హత్య.. ముక్కలు ముక్కలుగా నరికి..!

Kashmir Murder Case: కశ్మీర్‌లో కిరాతక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళను ఓ వ్యక్తి హత్య చేసి అమానుషంగా ముక్కలుగా నరికాడు.

కశ్మీర్‌లో ఢిల్లీ తరహా ఘటన.. పెళ్లికి నిరాకరించిందని హత్య.. ముక్కలు ముక్కలుగా నరికి..!
Crime News
Follow us

|

Updated on: Mar 12, 2023 | 4:42 PM

ప్రియురాలిని చంపి 32 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టిన ఉదంతాన్ని మరవకముందే కశ్మీర్‌లో అలాంటి ఘోరం మరొకటి జరిగింది. ఓ మహిళను చంపి ముక్కలు చేసి.. వేర్వేరుచోట్ల పడేశాడు. ప్రియుడి చేతిలో ముక్కలైన శ్రద్ధా వాకర్ హత్యను తలపించే ఈ ఉదంతం బుద్గామ్ జిల్లాలోని సోయిబుగ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి ఒక వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. మార్చి 7వ తేదీన జరిగిన హత్య.. తాజాగా వెలుగులోకి వచ్చింది.

30 ఏళ్ల వయసు ఉన్న మహిళ మార్చి 7వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. చివరికి ఆమె కాల్ డేటాను బట్టి షబ్బీర్ అహ్మద్ అనే వ్యక్తిని పోలీసులు మార్చి 8వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. తమ స్టైల్‌లో అతన్ని విచారించడంతో నేరం చేసినట్టు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అయితే హత్య వెనుక కచ్చితమైన కారణాన్ని పోలీసులు ఇంకా వెల్లడించలేదు. కానీ మహిళను పెళ్లి చేసుకుంటానని అహ్మద్ తమను సంప్రదించాడని, అయితే ఆమె అందుకు అంగీకరించలేదని మృతురాలి కుటుంబసభ్యులు చెబుతున్నారు. పెళ్లికి నిరాకరించిన కారణంగా ఆమెను అహ్మద్ చంపేశాడని ఆరోపించారు. అహ్మద్ కార్పెంటర్‌గా పని చేస్తున్నాడని, ఆ పనుల నిమిత్తం తరచూ అతడు తమ ఇంటికి వచ్చేవాడని హత్యకు గురైన మహిళ బంధువులు చెప్పారు. నిందితుడు ఆమెపై కోరిక పెంచుకున్నాడని, పెళ్లికి నిరాకరించటంతో కక్షకట్టి చంపేశాడని ఆరోపించారు.

బుడ్గామ్ జల్లాలోని ఓంపోరాలో షబ్బీర్ అహ్మద్ వనీ నివాసముంటున్నాడు. కార్పెంటర్‌గా పని చేసే అహ్మద్.. అదే ప్రాంతానికి చెందిన మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమెను కిడ్నాప్ చేసి దారుణానికి పాల్పడ్డాడు. నాలుగు రోజుల క్రితం ఆ మహిళకు మాయ మాటలు చెప్పి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడని పోలీసులు తెలిపారు. ఆమెను హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో పడేసినట్టు నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఓంపొరా, సబ్డెన్ రైల్వే బ్రిడ్జిలతో పాటు పలు చోట్ల శరీర భాగాలను పడేసినట్టు వెల్లడించాడు. బాధితురాలి తల, ఇతర శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడు అదుపులోకి తీసుకున్నామని.. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ అధికారి తెలిపారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.