Couple Dead: భర్త అనుమానాస్పద మృతి.. భార్య ఉరివేసుకొని బలవన్మరణం.. అసలు ఏమైందంటే..?

Couple Dead: మూడేళ్ల క్రితం వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాపురం సజావుగా సాగుతోంది. అయినప్పటికీ.. వీరి ప్రేమ వ్యవహారంపై ఇరువైపులా బంధువులకు మనస్పర్ధలు వీడలేదు. ఈ క్రమంలో యువకుడు చెరువులో శవమై

Couple Dead: భర్త అనుమానాస్పద మృతి.. భార్య ఉరివేసుకొని బలవన్మరణం.. అసలు ఏమైందంటే..?
suicide

Updated on: Apr 15, 2021 | 10:27 AM

Couple Dead: మూడేళ్ల క్రితం వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాపురం సజావుగా సాగుతోంది. అయినప్పటికీ.. వీరి ప్రేమ వ్యవహారంపై ఇరువైపులా బంధువులకు మనస్పర్ధలు వీడలేదు. ఈ క్రమంలో యువకుడు చెరువులో శవమై తేలగా.. ఈ విషయాన్ని తెలుసుకున్న యువతి కూడా ఆత్మహత్య చేసుకుంది. ఇలా భార్యాభర్తలు గంటల వ్యవధిలోనే మరణించారు. ఈ సంఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని మర్లపాడులో చెరువులో పడి నాగరాజు (24) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. భర్త చనిపోయాడనే విషయాన్ని తెలుసుకున్న భార్య శ్రీవల్లి (21) కూడా ఒంగోలులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

వివరాలు.. ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడుకు చెందిన గాలి నాగరాజు, ఒంగోలుకు చెందిన శ్రీవల్లి మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దంపతులిద్దరూ ఒంగోలులో నివసిస్తున్నారు. ఈ క్రమంలో రెండు నెలలుగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం తనను వేధిస్తున్నాడంటూ నాగరాజుపై శ్రీవల్లి కేసు కూడా పెట్టింది. ఈ నేపధ్యంలోనే నాగరాజు రాత్రి కొండపి మండలం జాలపాలెం తిరునాళ్ళకు వెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో టంగుటూరు మండలం మర్లపాడు దగ్గర చెరువులో శవమై తేలాడు. నాగరాజు ఒంటిపై గాయాలు ఉండటంతో మృతుడి బంధువులు అనుమానం వ్యక్తం చేశారు.

నాగరాజు భార్య తరుపు బంధువులే చంపి ఉంటారని, వెంటనే విచారించాలని పలువురు టంగుటూరు పోలీసులకు చెప్పారు. దీంతోవారు ఒంగోలులోని శ్రీవల్లి ఇంటికి వెళ్లి విచారించారు. ఒకవైపు భర్త చనిపోవడం, మరోవైపు పోలీసులు రావడంతో తీవ్రంగా మనస్థాపానికి గురైన శ్రీవల్లి ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అయితే పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఆమె చనిపోయిందంటూ శ్రీవల్లి బంధువులు ఆరోపించారు. ఆమెను సకాలంలో ఆసుపత్రికి తీసుకెళితే బతికుండేదని శ్రీవల్లి తల్లి పేర్కొన్నారు. ఉరి వేసుకున్న తన కూతురిని సకాలంలో దింపకుండా ఆలస్యం చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read:

Health Benefits of Cloves: లవంగాలు తింటే.. ఈ అనారోగ్య సమస్యలన్నీ మటుమాయమే.. అవేంటంటే..?

ఏడు రోజుల్లో ఏడు కిలోల బరువు తగ్గవచ్చు..! కేవలం కీరదోస తింటే చాలు.. ఎలాగో తెలుసుకోండి..?