పీపీఈలు ఇవ్వరా..? డాక్టర్ల నగ్న నిరసన
ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ నుంచి తమను కాపాడాలంటూ వైద్యులు వేడుకుంటున్నారు. అవసరమైన పీపీఈ కిట్లను అందించి
ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ నుంచి తమను కాపాడాలంటూ వైద్యులు వేడుకుంటున్నారు. అవసరమైన పీపీఈ కిట్లను అందించి డాక్టర్లు వైరస్ బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలదేనంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం దిగిరావాలని కోరుతూ అక్కడి వైద్యులు అర్థనగ్న నిరసన చేపట్టారు.
కరోనా వైరస్కు ముందుండి పోరాడుతున్న వైద్యులకు తగిన రక్షణాత్మక పరికరాలు (పీపీఈ) కిట్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని మన దగ్గరే కాదు జర్మనీలోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాలను పక్కనబెట్టి ముందు మాకు రక్షణాత్మక దుస్తులు, పరికరాలను సరఫరా చేయండని వారు డిమాండ్ చేస్తున్నారు. కరోనా వైరస్ తీవ్ర స్థాయలో ప్రపంచవ్యాప్తంగా విజృంభించడంతో రక్షణాత్మక పరికరాలు, దుస్తులైన గ్లవ్స్, మాస్క్స్, వెంటిలేటర్లకు భారీగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో సరఫరా సరిపోవడం లేదు. అందువల్లే అందరికీ అందించలేకపోతున్నామని జర్మనీ ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి ఒకరు అంగీకరించారు. ఇప్పటికే 133 మిలియన్ మాస్క్లను దేశవ్యాప్తంగా పంపిణీ చేసినట్టు తెలిపారు. చైనా నుంచి 10 మిలియన్ మాస్క్లను తాజాగా దిగుమతి చేసుకున్నామని, మొత్తం సైన్యానికి మరో 15 మిలియన్ మాస్క్లను అతి త్వరలోనే అందిస్తామని కూడా వివరించారు.
జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తాజా గణాంకాల ప్రకారం జర్మనీలో ఇప్పటికే ఒక లక్షా 59 వేల మందికి కరోనా వైరస్ సోకింది. అందులో ఆరు వేల మందికి పైగా చనిపోయారు. జర్మనీ ఇంకా కరోనా వైరస్ తీవ్రత నుంచి బయటపడలేదని, ఇంకా చాలా కాలం పట్టవచ్చునని చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ స్పష్టం చేశారు. ఇది వినడానికి కష్టంగా ఉన్నప్పటికీ కరోనాతో మనం కొంతకాలం కలిసి జీవించాల్సిందేనని ఆమె వ్యాఖ్యానించారు. కాగా, జర్మనీలో ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించేందుకు వీలుగా కొన్ని సంస్థలు, దుకాణాలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.