శ్రీవారి భక్తులకు నిరాశ…దర్శనాలు రద్దు
ప్రపంచదేశాలను వణికిస్తున్న కోవిడ్-19 మహమ్మారి దేవుళ్లను కూడా వెంటాడుతోంది. కరోనా దెబ్బకు దేశంలోని ప్రధాన ఆలయాలన్నీ మూతపడ్డాయి. తాజాగా శ్రీవారి దర్శనం మరో ..
ప్రపంచదేశాలను వణికిస్తున్న కోవిడ్-19 మహమ్మారి దేవుళ్లను కూడా వెంటాడుతోంది. కరోనా దెబ్బకు దేశంలోని ప్రధాన ఆలయాలన్నీ మూతపడ్డాయి. దర్శనాలకు వచ్చే భక్తులను అనుమతించడంలేదు. ఆలయాల్లో పూజలను ఏకంతంగా నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం సైతం మార్చి 22 నుంచి భక్తుల రాకపై ఆంక్షలు విధించింది. తొలుత వారం రోజుల వరకు నిషేధిస్తున్నట్టు ప్రకటించిన టీటీడీ దీనిని ఏప్రిల్ 14 వరకు పొడిగించింది. దీంతో తిరుమలలో ఉగాది ఆస్థానం, శ్రీరామ నవమి వేడుకలు సైతం స్వామికి ఏకాంతంగానే నిర్వహించారు. తాజాగా శ్రీవారి దర్శనం మరో రెండు వారాలపాటు రద్దు చేయాలని టీటీడీ భావిస్తోంది.
కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను పొడిగిస్తుందన్న సంకేతాల నేపథ్యంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని ఈ నెలాఖరు వరకు నిషేధించాలని టిటిడి భావిస్తున్నది. కరోనా వ్యాప్తి, రోజురోజుకూ పెరుగుతున్న కేసుల సంఖ్యతో దేశవ్యాప్తంగా కేంద్రం నిబంధనలు కొనసాగిస్తోంది. తాజా పరిణామాలను బట్టి ఈ నెలాఖరు వరకు భక్తులకు దర్శనం, సేవలను రద్దు చేసి, స్వామి వారి కైంకర్యాలను ఏకాంతంగా కొనసాగించనుంది.
తిరుమల కనుమ దారులు వాహనాల రాకపోకలను పూర్తిగా రద్దుచేసింది. తిరుపతి, సమీప గ్రామాల్లో పేదలు, వలస కార్మికులు, యాచకులకు పూటకు 50 వేల మందికి ఆహారం పెట్టడానికి. టిటిడి అన్నదాన కేంద్రంలో తయారుచేసి అందిస్తోంది. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం ప్రారంభమైన ‘యోగవాశిష్టం-శ్రీ ధన్వంతరి మహామంత్ర’ పారాయణాన్ని వేదపండితులు కొనసాగిస్తున్నారు. లోక కల్యాణార్థం, మానవాళి ఆరోగ్యం కాంక్షిస్తూ టీటీడీ ఈ క్రతువు చేపట్టింది.