మళ్లీ పుంజుకుంటున్న కరోనా..పెరుగుతున్న కేసులు
ఇండియాలో కరోనా అదుపు తప్పినట్లే కనిపిస్తోందని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్రాలు మరింత జాగ్రత్త పడకపోతే ఇబ్బంది తప్పదని హెచ్చరిస్తున్నారు.
కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 46,433 కరోనా కేసులు నమోదయ్యాయని, ఇప్పటి వరకు 1,568 మంది మృతి చెందినట్లుగా వెల్లడించింది. ఇప్పటి వరకు 12,727 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా.. 32,138 యాక్టివ్ కేసులు ఉన్నాయని స్పష్టం చేసింది. ఇక మహారాష్ట్రలో అత్యధికంగా 14,541 కేసులు నమోదవ్వగా, గుజరాత్లో 5,804 కేసులు, ఢిల్లీలో 4, 898 కేసులు నమోదైనట్లు స్పష్టం చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పరిశీలించగా…
ఆంధ్రప్రదేశ్ః
ఆంధ్రప్రదేశ్ని కోవిడ్ భూతం పట్టి పీడిస్తోంది. ప్రజలు, అధికార యంత్రాంగానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఏపీలో రోజుకు కనీసం 60-70 కేసులొస్తున్నాయి. 24 గంటల్లో 67 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 1, గుంటూరు 19, కడప 4, కృష్ణా 12, కర్నూలు 25, విశాఖపట్నంలో 6 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1, 650కి చేరింది. 33 మంది మరణించారు. ప్రస్తుతం 1093 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తెలంగాణః
తెలంగాణలో ఓసారి కేసులు పెరుగుతూ… ఓసారి తగ్గుతూ ఉన్నాయి. తాజాగా 3 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా 40 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1085కి చేరింది. వీరిలో కరోనాతో పోరాడుతూ ఇప్పటి వరకు 585 మంది కోలుకోగా… 29 మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 471 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.