క్వారంటైన్ సెంటర్లో వైద్య సిబ్బందికి అస్వస్థత
కోవిడ్ వైరస్ అనుమానితులు కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది అనారోగ్యం బారిన పడుతున్నారు.
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజు రోజుకూ వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 35 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 757కు చేరింది. కోవిడ్ వైరస్ అనుమానితులు కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ సిబ్బంది అస్వస్థతకు గురైన్నట్లుగా తెలిసింది. వివరాల్లోకి వెళితే…
పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా వైరస్ అనుమానితుల కోసం భీమవరంలో క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేశారు. 82 ఎకరాలలో ఏర్పాటు చేసిన ఇక్కడి క్వారంటైన్ సెంటర్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది అస్వస్థతకు గురవడం కలకలం రేపుతోంది. రక్త నమూనాలు సేకరించడానికి వెళ్లిన డాక్టర్, లాబ్ టెక్నీషన్ అస్వస్థతకు గురయ్యారు. డీహైడ్రేషన్కు గురై డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్ కళ్లు తిరిగి పడిపోయారు. భీమవరం ప్రభుత్వాసుపత్రిలో వారికి ప్రథమ చికిత్స అందించి ఇద్దరినీ ఇంటికి తరలించారు. క్వారంటైన్ సెంటర్లలో పనిచేస్తున్న సిబ్బందికి సరైన సదుపాయాలు లేకపోవడం వల్లే ఇలా జరిగిందంటూ తోటి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.