ముస్లింలకు పవిత్ర మాసం రంజాన్. ఈ నెల వస్తే చాలు.. అంతటా ఇఫ్తార్ విందులతో కోలాహలం నెలకొంటుంది. అయితే ప్రస్తుం కరోనా కాలంలో.. ఇఫ్తార్ విందులపై పలు దేశాలు నిషేధాన్ని విధిస్తున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా రంజాన్ మాసంలో జరిగే ఇఫ్తార్ విందులపై నిషేధం విధించింది. కరోనా మహమ్మారి కట్టడికి చేపట్టే చర్యల్లో భాగంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపింది. శుక్రవారం ఉదయం బంగ్లాదేశ్ మత వ్యవహారాల శాఖ దీనికి సంబంధించి ఓ ప్రకటన విడుదల చేసింది.
కరోనా వైరస్ బారిన పడకుండా సోషల్ డిస్టెన్స్ పాటించాలని.. ఈ రంజాన్ మాసంలో వ్యక్తిగతంగా కానీ.. స్వచ్చంద సంస్థలు గానీ ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయరాదని బంగ్లా సర్కార్ స్పష్టం చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే.. కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించింది. బంగ్లాదేశ్లో ఇప్పటి వరకు కరోనా బారినపడ్డ వారి సంఖ్య 4,186కి చేరింది. వీరిలో 127 మంది ప్రాణాలు కోల్పోయారు.