Scholarship Rules: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. చదువు మధ్యలో మానేస్తే స్కాలర్షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే!
పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాల విధానంలో ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. అర్హత పొందిన తర్వాత విద్యార్థులు మధ్యలో చదువు మానేస్తే చెల్లించిన ఫీజును తిరిగి వసూలు చేయనుంది. ఇకపై ఆదాయ ధ్రువీకరణ పత్రం ఒక్కసారి తీసుకుంటే కోర్సు పూర్తయ్యే వరకు చెల్లుబాటు అవుతుంది. దివ్యాంగ విద్యార్థులకు అదనంగా 10 శాతం ఉపకారవేతనం ఇవ్వనున్నారు. ఇంకా మరెన్నో మార్పులు తీసుకొచ్చారు..

హైదరాబాద్, జూన్ 11: రాష్ట్రంలో పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాల విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. అర్హులైన విద్యార్థులకు బోధన ఫీజులు, స్కాలర్షిప్లు మంజూరు అయిన తర్వాత వారు మధ్యలో చదువును నిలిపివేస్తే, చెల్లించిన మొత్తాన్ని తిరిగి రికవరీ చేసే అధికారం సంబంధిత సంక్షేమ శాఖలకు కల్పించింది. అలాగే కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరూ పోస్టుమెట్రిక్ బోధన ఫీజులు, ఉపకారవేతనాలు పొందే అర్హత ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులు బోధన ఫీజు రీయింబర్స్మెంట్ లేదా ప్రొఫెషనల్ కోర్సులకు ఇచ్చే స్టైపెండ్లో ఏదో ఒకదానిని మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. కొత్త విధానంలో అక్రమాలకు తావు లేకుండా కొన్ని కఠిన నిబంధనలతో పాటు విద్యార్థులకు అనుకూలమైన సడలింపులు కూడా కల్పించారు.
ముఖ్యమైన మార్పులు ఇవే
- కోర్సులో చేరినప్పుడు తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం అదే కోర్సు పూర్తయ్యే వరకు చెల్లుబాటు అవుతుంది; ప్రతి సంవత్సరం కొత్త సర్టిఫికెట్ అవసరం లేదు.
- అదనపు డిగ్రీ లేదా పీజీ కోర్సులకు బోధన ఫీజులు, ఉపకారవేతనాలు వర్తించవు. గతంలో తీసుకున్న ఫీజు తిరిగి చెల్లిస్తే మాత్రమే రెండో కోర్సుకు అవకాశం ఉండేది.
- దివ్యాంగ విద్యార్థులకు ఉపకారవేతనాలు (ఎంటీఎఫ్) సాధారణ విద్యార్థుల కంటే 10 శాతం అధికంగా అందుతాయి.
- ఆధార్ ధృవీకరణ తర్వాతే దరఖాస్తు ప్రాసెస్ ముందుకు వెళ్తుంది. విద్యార్థులు తమ ఆధార్లో విద్యా వివరాలను సరిచేసుకోవాలి.
- అన్ని ధ్రువీకరణ పత్రాలను కళాశాలలు ఈ-పాస్ వెబ్సైట్లో డిజిటల్ రూపంలో అప్లోడ్ చేయాలి.
- బ్యాంకు ఖాతా వివరాల్లో తప్పులు ఉంటే విద్యార్థులకు వెంటనే సమాచారం ఇవ్వాలి.
- జిల్లా అధికారులు డిజిటల్ పత్రాలను పరిశీలించి డిజిటల్ కీ ద్వారా ఫీజులు, ఉపకారవేతనాలను మంజూరు చేస్తారు.
ఈ కొత్త విధానంతో పారదర్శకత పెరుగుతుందని, అర్హులైన విద్యార్థులకు సమయానికి ఆర్థిక సహాయం అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
