
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ సెట్)-2023 దరఖాస్తు గడువు పొడిగిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటన వెలువరించింది. గతంలో ఇచ్చిన సెట్ 2023 నోటిఫికేషన్ ప్రకారం ఆన్ లైన్ దరఖాస్తులకు ఆగస్టు 29వ తేదీతో తుది గడువు ముగిసింది. తాజాగా ప్రకటనలో ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా సెప్టెంబర్ 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవల్సిందిగా అధికారులు తెలిపారు. ఇక సెట్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే.
కాగా ప్రతీయేట అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాల అర్హత కోసం ఉస్మానియా యూనివర్సిటీ టీఎస్ సెట్ పరీక్ష నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా సెట్ నిర్వహణకు ప్రకటన వెలువరించింది. మొత్తం జనరల్ స్టడీస్, 29 సబ్జెక్టుల్లో సీబీటీ విధానంలో అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో సీబీటీ విధానంలో పరీక్ష జరుగనుంది. కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణులైనవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ఠ వయోపరిమితి ఏమీలేదు. దరఖాస్తు ఫీజు కింద ఓసీ కేటగిరీ అభ్యర్ధులు రూ.2000, బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.1500, ఎస్సీ, ఎస్టీ, వీహెచ్, హెచ్ఐ, ఓహెచ్, ట్రాన్స్జెండర్ అభ్యర్ధులు రూ.1000 చెల్లించాలి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.