ఇన్సర్వీస్ టీచర్ల TET కీ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. మరికొన్ని గంటల్లోనే విడుదల
ఇన్సర్వీస్ టీచర్లకు నిర్వహించిన టెట్ ప్రాథమిక కీని సెప్టెంబరు 15న విడుదల చేయనున్నారు. కీపై అభ్యంతరాలను సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 1 వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. సెప్టెంబరు 8, 9న జరిగిన పరీక్షకు 24,986 మందికి గాను 22,477 మంది హాజరయ్యారు..

హైదరాబాద్, సెప్టెంబర్ 13: తెలంగాణలో ఇన్సర్వీస్ టీచర్లకు నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)కు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని సెప్టెంబరు 15న విడుదల చేయనున్నట్లు పరీక్ష కన్వీనర్ గాజర్ల రమేశ్ తెలిపారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు. సెప్టెంబరు 8, 9 తేదీల్లో ఇన్సర్వీస్ టీచర్ల కోసం టెట్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 24,986 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 22,477 మంది పరీక్షకు హాజరయ్యారు.
సెప్టెంబరు 15న ప్రాథమిక కీ విడుదలైన అనంతరం అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు కన్వీనర్ తెలిపారు. అభ్యర్థులు ప్రాథమిక కీని పరిశీలించి, ఏదైనా ప్రశ్నకు సంబంధించిన సమాధానంపై అభ్యంతరం ఉంటే.. నిర్దేశిత గడువులోగా సంబంధిత ఆధారాలతో ఆన్లైన్లో అభ్యంతరం నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండదు.
ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది ‘కీ’ని విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో టెట్ పరీక్ష రాసిన ఇన్సర్వీస్ టీచర్లు సెప్టెంబరు 15 నుంచి అధికారిక ప్రకటనలను పరిశీలిస్తూ, తమ సమాధానాలను కీతో సరిపోల్చుకోవాలని సూచిస్తున్నారు.




