TGPSC Group IV Results: టీజీపీఎస్సీ గ్రూప్‌ 4 తుది ఫలితాలపై హైకోర్టు స్టే.. కారణం ఇదే

|

Sep 05, 2024 | 1:59 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రూప్‌-4 పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు కీలక ప్రకటన చేసింది. తుది తీర్పుకు లోబడి ఎంపిక ప్రక్రియ ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్ల కల్పనపై 10 రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా తెలంగాణలో టీజీపీఎస్సీ గ్రూప్‌ 4 పోస్టుల భర్తీకి సంబంధించి 2022 డిసెంబరులో నోటిఫికేషన్‌ జారీ అయిన సంగతి తెలిసిందే..

TGPSC Group IV Results: టీజీపీఎస్సీ గ్రూప్‌ 4 తుది ఫలితాలపై హైకోర్టు స్టే.. కారణం ఇదే
Telangana High Court
Follow us on

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రూప్‌-4 పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు కీలక ప్రకటన చేసింది. తుది తీర్పుకు లోబడి ఎంపిక ప్రక్రియ ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్ల కల్పనపై 10 రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా తెలంగాణలో టీజీపీఎస్సీ గ్రూప్‌ 4 పోస్టుల భర్తీకి సంబంధించి 2022 డిసెంబరులో నోటిఫికేషన్‌ జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 8,180 పోస్టులను భర్తీ చేయనున్నారు.ఇప్పటికే 1:3 నిష్పత్తిలో జనరల్ మెరిట్ జాబితా కూడా విడుదల చేయగా.. వారందరికీ ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసింది. అయితే ఈ నోటిఫికేషన్‌లో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించకపోవడంపై సూర్యాపేట జిల్లాకు చెందిన దేవత్‌ శ్రీను, దేవత్‌ తనుశ్రీతో పాటు మరో ముగ్గురు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం బుధవారం (సెప్టెంబర్ 4) విచారణ చేపట్టింది.

పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఎల్‌ రవిచందర్‌ వాదనలు వినిపించారు. ఉద్యోగ నియామకాల్లో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ న్యాయ సేవాధికార సంస్థ Vs కేంద్రం కేసులో 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు.ఇప్పటికే గ్రూప్‌ 4 పోస్టులకు సంబంధించి రాత పరీక్ష పూర్తికాగా.. ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో గ్రూప్‌-4 పోస్టుల తుది ఫలితాలు హైకోర్టు తీర్పుకు లోబడి ఉండేలా ఆదేశించాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోరారు.

అనంతరం ప్రభుత్వం తరపు అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ ఇమ్రాన్‌ఖాన్‌ వాదనలు వినిపిస్తూ.. కౌంటరు దాఖలు చేయడానికి 10 రోజుల గడువు కోరారు. దీంతో ధర్మాసనం కౌంటరు దాఖలుకు ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తూ గడువు ఇచ్చింది. అంతేకాకుండా గ్రూప్‌ 1 తుది ఫలితాల వెల్లడిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ ఈలోపు ప్రభుత్వం ఫలితాలు వెల్లడిస్తే.. తుది తీర్పుకు లోబడి నియామకాలు ఉంటాయని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.