
హైదరాబాద్, జనవరి 1: తెలంగాణ గ్రూప్ 1 వివాదం ఎట్టకేలకు తుది దశకు చేరుకుంది. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంకు సంబంధించిన హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాయి. దీంతో జనవరి 22న హైకోర్టు తీర్పు వెలువరించనుంది. గతంలో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని అభిప్రాయపడిన హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి మార్కుల తుది జాబితా, జనరల్ ర్యాంకులను రద్దు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ టీజీపీఎస్సీతోపాటు, గ్రూప్ 1లో ఉద్యోగాలు పొందిన పలువురు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది.
ఈ ధర్మాసనం 2022లో టీజీపీఎస్సీ జారీ చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ను రద్దు చేస్తూ.. అదనంగా వచ్చిన పోస్టులతో కలిపి 563 పోస్టులకు టీజీపీఎస్సీ మరో నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశం లేకపోయినా కమిషన్ రెండింటికీ కలిపి ఒక్క నోటిఫికేషన్ జారీ చేసింది. అంతేకాకుండా ప్రిలిమ్స్కు, మెయిన్స్కు వేర్వేరుగా హాల్టికెట్ నంబర్లు కేటాయించింది. నిజానికి ఇది చట్టవిరుద్ధం. ఆ తర్వాత జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో కేవలం 4 వేర్వేరు పరీక్ష సెంటర్లలోని వారికే ఎక్కువ మార్కులు రావడం అనుమానాలకు తావిచ్చింది. పైగా సమాధాన పత్రాలను అన్ని సబ్జెక్టులకు చెందిన నిపుణులు మూల్యాంకనం చేయలేదని పిటీషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు.
దీనిపై టీజీపీఎస్సీ తరపు లాయర్లు వాదనలు వినిపిస్తూ.. టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారమే పారదర్శకంగా పరీక్షలు నిర్వహించిందని స్పష్టం చేశారు. అవకతవకలు జరగకూడదనే ఒక జవాబు పత్రాన్ని కమిషన్ ఇద్దరితో మూల్యాంకనం చేయించిందని తెలిపారు. ఇద్దరు వేసిన మార్కుల్లో తేడా 15 శాతంకంటే ఎక్కువ ఉంటే మూడోవ్యక్తి మూల్యాంకనం చేస్తారని పేర్కొన్నారు. అయితే ఆ జవాబు పత్రాలు ఎవరు దిద్దారనేది మరొకరికి తెలియకుండా గోప్యంగా ఉంచారని వివరణ ఇచ్చారు. పరిపాల సౌలభ్యం కోసమే ప్రిలిమ్స్, మెయిన్స్కు వేర్వేరుగా హాల్ టికెట్లు జారీ చేశామని, కాపీయింగ్ జరిగిందనే ఆరోపణల్లో నిజం లేదని, కొన్ని పరీక్ష కేంద్రాల్లో ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారనే కారణంతో పరీక్షలను రద్దు చేయడం సరికాదని వాదించారు. ఇరువైపులా వదలను విన్న ధర్మాసనం తీర్పును జనవరి 22వ తేదీకి వాయిదా వేసింది. ఈ క్రమంలో కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.