ఇక బడి విద్యార్థుల వివరాలు డిజిటలైజేషన్.. APAAR నమోదుపై విద్యాశాఖ ఫోకస్!
హైదరాబాద్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలను మరింత క్రమబద్ధంగా నమోదు చేసేందుకు జిల్లా యంత్రాంగం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న ప్రతి విద్యార్థి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఇందుకోసం విద్యార్థుల ఆధార్, అపార్ వివరాలను పాఠశాల రికార్డులతో అనుసంధానం చేస్తున్నారు..

హైదరాబాద్, సెప్టెంబర్ 3: విద్యార్థి వివరాలు ఒకసారి డిజిటల్గా నమోదైతే.. భవిష్యత్తులో అతడి విద్యకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడం మరింత సులభం కానుంది. ఆధార్ ద్వారా విద్యార్థి గుర్తింపును నిర్ధారించడంతో పాటు, అపార్ ద్వారా విద్యార్థి చదువు, మార్కులు, ప్రతిభ, సాధించిన పురస్కారాలు వంటి విద్యా వివరాలను ఒకేచోట అందుబాటులో ఉంచే అవకాశం ఉంటుంది. విద్యార్థుల వివరాలను నమోదు చేయడంలో ప్రధానంగా మూడు అంశాలపై అధికారులు దృష్టి పెట్టారు. మొదటిది.. పాఠశాలల వారీగా విద్యార్థుల వివరాలను యూడైస్లో సరిగ్గా నమోదు చేయడం. విద్యార్థి పేరు, తల్లిదండ్రుల వివరాలు తదితర సమాచారం తప్పులు లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. పదో తరగతి పరీక్షలకు ముందు హాల్టికెట్ వివరాలను తల్లిదండ్రులు పరిశీలించి, ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకునే అవకాశం ఉంటుంది. రెండోది.. అపార్ నమోదు. దేశవ్యాప్తంగా ప్రతి విద్యార్థికి ప్రత్యేకంగా కేటాయించే ఈ గుర్తింపు ద్వారా అతడి విద్యా ప్రస్థానాన్ని డిజిటల్గా అనుసంధానం చేయవచ్చు. ఒకటో తరగతి నుంచి ఉన్నత విద్య వరకు విద్యార్థి ఎక్కడ చదివినా.. అపార్ సంఖ్య ఆధారంగా అతడి విద్యా వివరాలను ఒకేచోట తెలుసుకునే అవకాశం ఉంటుంది.
మూడోది.. ఆధార్ వివరాల నవీకరణ. విద్యార్థుల ఆధార్లో బయోమెట్రిక్ వివరాలను ఎప్పటికప్పుడు సరిచేయడం ద్వారా వారు ఉన్నత తరగతులు, కళాశాలల్లోకి వెళ్లినప్పుడు అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవడం సులభమవుతుంది. మరోవైపు.. బడి వయసున్న ప్రతి చిన్నారి పాఠశాలలో ఉండాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల నమోదు కార్యక్రమాన్ని జూన్ 15 నుంచి చేపట్టింది. ఇందులో భాగంగా మండలాల వారీగా విద్యాశాఖ అధికారులు ఇళ్లకు వెళ్లి, పాఠశాలకు వెళ్లని పిల్లలను గుర్తించి సమీపంలోని బడుల్లో చేర్పించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్లో పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అధికారులు తమ పరిధిలోని ప్రాంతాల్లో పర్యటించి బడి వయసున్న పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
హైదరాబాద్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు సుమారు 10.29 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ఇప్పటికే 9.36 లక్షల మంది విద్యార్థుల ఆధార్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అదే సమయంలో అపార్ నమోదులో 59 శాతం మంది విద్యార్థుల వివరాలు ఆన్లైన్లోకి వచ్చినట్లు వెల్లడించారు. ఈ సమాచారాన్ని డిజిటల్గా అందుబాటులోకి తీసుకురావడం వల్ల భవిష్యత్తులో విద్యార్థుల సంఖ్య, పాఠశాలల్లో నమోదు, చదువు మధ్యలో మానేసే పిల్లలు, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు వంటి అంశాలపై ప్రభుత్వానికి మరింత స్పష్టమైన సమాచారం అందనుంది. దీంతో అవసరమైన ప్రాంతాల్లో కొత్త పాఠశాలలు ఏర్పాటు చేయడం, విద్యార్థులకు సంక్షేమ పథకాలను మరింత లక్ష్యబద్ధంగా అందించడం వంటి చర్యలకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంది.




