తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో బుధవారం (మార్చి 15)నాడు దాదాపు 2 గంటల పాటు విచారణ జరిపారు. టీఎస్పీఎస్సీ ఆఫీస్లోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మి, ఛైర్మన్, కార్యదర్శి కంప్యూటర్లను సిట్ అధికారులు తనిఖీ చేశారు. ఛైర్మన్, కార్యదర్శి విభాగాల్లో పనిచేసే సిబ్బంది వివరాలు సేకరించారు. టెక్నికల్ టీం నుంచి టీఎస్పీఎస్సీ సర్వర్లకు సంబంధించిన వివరాలు సేకరించారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ నుంచి ఐపీ అడ్రస్, యూజర్ ఐడీ, పాస్వర్డ్లను ప్రవీణ్ దొంగిలించినట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఆ తర్వాత ప్రవీణ్తో చనువుగా ఉండే వారి వివరాలను సిట్ ఆరా తీసింది. ఏఈ ప్రశ్నపత్రం లీక్పై సేకరించిన ఆధారాలను అధికారులు గురువారం నాడు టీఎస్పీఎస్సీకి నివేదిక అందించనున్నారు.
కొంతకాలం క్రితం కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ కంప్యూటర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో అక్కడ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రాజశేఖర్ రిపేర్ చేశాడు. ఆ సమయంలో డైనమిక్ ఐపీ అడ్రస్కు బదులు తనకు అనుకూలంగా స్టాటిక్ ఐపీని ఆ కంప్యూటర్కు అమర్చాడు. అనంతరం రాజశేఖర్ సాయంతోనే ప్రవీణ్ ప్రశ్నపత్రాలను పెన్ డ్రైవ్లోకి కాపీ చేయించుకున్నాడు. ప్రశ్నాపత్రాలను తొలుత రేణుక, ఆమె భర్తకు రూ.10లక్షలకు ప్రవీణ్ విక్రయించాడు. రేణుక ఇచ్చిన రూ.10లక్షలు ఎస్బీఐ ఖాతాలో జమ అయ్యాయి. ఆ తర్వాత రాజమహేంద్రవరంలో ఉన్న తన బాబాయ్ అకౌంట్కు రూ.3.5లక్షలు ట్రాన్ఫర్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఏఈ ప్రశ్నపత్రంతో పాటు టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ ప్రశ్నపత్రాల లీకేజీ గురించి కూడా సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదికను మార్చి 16 సిట్ అధికారులు కమిషన్కు సమర్పించనున్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.