AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TETలో గట్టెక్కలేక చతికిల పడుతున్న సైన్స్, సోషల్‌ టీచర్లు.. పాత తరం ఇంకా అప్‌డేట్‌ కాలేదా?

విద్యార్థులకు పాఠాలు బోధించే ప్రభుత్వ ఉపాధ్యాయులే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో భారీగా విఫలమవడం రాష్ట్ర విద్యా వ్యవస్థలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల నిర్వహించిన టెట్ జూన్ 2026 పరీక్ష ఫలితాలు విడుదల కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వేలాది మంది ఉపాధ్యాయులు అర్హత సాధించలేకపోయారు. ఈ పరిణామం విద్యా ప్రమాణాలు, బోధనా నాణ్యత, ఉపాధ్యాయుల సామర్థ్యాలపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది..

TETలో గట్టెక్కలేక చతికిల పడుతున్న సైన్స్, సోషల్‌ టీచర్లు.. పాత తరం ఇంకా అప్‌డేట్‌ కాలేదా?
Govt School Teachers Struggle to Pass TET Exam
Srilakshmi C
|

Updated on: Jul 15, 2026 | 12:31 PM

Share

హైదరాబాద్‌, జులై 15: ఈ ఏడాది టెట్ పరీక్షకు మొత్తం 23,623 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు హాజరయ్యారు. అయితే వీరిలో కేవలం 8,809 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించగా, 14,814 మంది ఫెయిలయ్యారు. అంటే ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో కేవలం 37.29 శాతం మంది మాత్రమే టెట్ అర్హత సాధించారు. మరోవైపు బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థుల్లో 45.66 శాతం మంది టెట్‌లో ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తే పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపిస్తోంది. సైన్స్ పేపర్ రాసిన ఉపాధ్యాయుల్లో 38.27 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. సోషల్ స్టడీస్ పేపర్ రాసిన వారిలో పరిస్థితి మరింత దారుణంగా ఉండి, కేవలం 24.05 శాతం మంది మాత్రమే టెట్‌లో అర్హత సాధించారు. ముఖ్యంగా సైన్స్, సోషల్ సబ్జెక్టులు బోధిస్తున్న ఉపాధ్యాయులే అధిక సంఖ్యలో విఫలమవడం విద్యాశాఖను ఆలోచనలో పడేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 2028 ఆగస్టు నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయుడు టెట్ అర్హతను తప్పనిసరిగా సాధించాల్సి ఉంది. లేకపోతే ఉద్యోగ భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టెట్‌లో విఫలమైన ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం ఇన్-సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేక టెట్ పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఏడాదికి రెండుసార్లు ప్రత్యేక టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించగా, సాధారణ టెట్ పరీక్షలతో కలిపి మొత్తం నాలుగు అవకాశాలు కల్పించనుంది.

ఉపాధ్యాయుల వాదన ప్రకారం, తాము ఎన్నో ఏళ్లుగా ఒకే సబ్జెక్టును బోధిస్తున్నందున ఆ అంశంలోనే ప్రావీణ్యం కలిగి ఉన్నామని, టెట్‌లో అన్ని అంశాలపై ప్రశ్నలు రావడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా సైకాలజీ, తాజా విద్యా విధానాలు, NCERT ఆధారిత అంశాలు తమకు సవాలుగా మారుతున్నాయని పేర్కొంటున్నారు. 8వ తరగతి నుంచి ఉన్న NCERT పాఠ్యాంశాలను చదవకపోతే టెట్‌లో ఉత్తీర్ణత సాధించడం కష్టమని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1.06 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. గత ఏడాది వరకు టెట్ అర్హత సాధించని వారి సంఖ్య సుమారు 40 వేలుగా ఉండగా, తాజా ఫలితాల తర్వాత కూడా దాదాపు 30 వేల మంది ఇంకా టెట్ క్లియర్ చేయాల్సి ఉంది. దశాబ్దాల క్రితం బీఈడీ పూర్తి చేసిన ఉపాధ్యాయులు అప్పటి బోధనా విధానాలు, సిలబస్‌కు అలవాటు పడగా, ప్రస్తుతం విద్యా రంగంలో చోటుచేసుకున్న సాంకేతిక మార్పులు, డిజిటల్ విద్య, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలకు అనుగుణంగా తమను తాము అప్‌డేట్ చేసుకోవడం కష్టంగా మారుతోందని చెబుతున్నారు.

విద్యాశాఖ అధికారులు మాత్రం మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కొత్త బోధనా పద్ధతులను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. కంప్యూటర్ ఆధారిత బోధన, ఆధునిక గణిత విధానాలు, డిజిటల్ లెర్నింగ్ టూల్స్ విద్యార్థులకు అందించాల్సిన పరిస్థితుల్లో ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచిస్తున్నారు. ఇక నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (NAS) కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు ఆశించిన స్థాయిలో లేవని వెల్లడించింది. ముఖ్యంగా సైన్స్, గణితం, సామాజిక శాస్త్రాల అంశాల్లో విద్యార్థుల ప్రదర్శన బలహీనంగా ఉందని సర్వే తేల్చింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల అర్హత, శిక్షణ, బోధనా నాణ్యతపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా టెట్ ఫలితాలు రాష్ట్ర విద్యా వ్యవస్థలో ఉన్న సవాళ్లను మరోసారి వెలుగులోకి తెచ్చాయి. ఉపాధ్యాయులకు తగిన శిక్షణ, ఆధునిక బోధనా నైపుణ్యాల అభివృద్ధి, నిరంతర మూల్యాంకనం ద్వారా మాత్రమే విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us