NMMS Scholarship 2025: సర్కార్ బడుల్లో చదివే పేదింటి పిల్లలకు స్కాలర్‌షిప్‌ ఛాన్స్.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!

ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో, స్థానిక సంస్థల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరం 8వ తరగతి చదువుతూ ఉన్న విద్యార్ధులకు కేంద్ర ప్రభుత్వం యేటా మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ అందిస్తున్న సంగతి తెలిసిందే. 2025-26 విద్యా సంవత్సరానికి కూడా విద్యార్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్..

NMMS Scholarship 2025: సర్కార్ బడుల్లో చదివే పేదింటి పిల్లలకు స్కాలర్‌షిప్‌ ఛాన్స్.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!
NMMS Scholarship For Govt School students

Updated on: Jun 16, 2025 | 7:33 AM

కేంద్ర ప్రభుత్వం యేటా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ అందిస్తున్న సంగతి తెలిసిందే. 2025-26 విద్యా సంవత్సరానికి కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 8వ తరగతి తర్వాత విద్యార్థుల డ్రాప్‌ఔట్ కాకుండా నివారించి, వారిని చదువుకునేందుకు ప్రోత్సహించడం, ప్రాథమిక విద్యను కొనసాగించడమే లక్ష్యంగా కేంద్ర సర్కార్ ఈ పథకాన్ని అమలు చేస్తుంది. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్టు 31, 2025వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్‌ (NMMSS)కు సంబంధించిన ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు.

ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో, స్థానిక సంస్థల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరం 8వ తరగతి చదువుతూ ఉన్న విద్యార్ధులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే విద్యార్ధుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3.50 లక్షలకు మించకుండా ఉండాలి. 7వ తరగతిలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. ఈ పథకానికి ఎంపికైన లక్ష మంది విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ పూర్తిచేసే వరకు ఉపకారవేతనం లభిస్తుంది. అయితే కేంద్రీయ విద్యాలయాలు, నవోదయలు, రెసిడెన్షియల్ స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ వర్తించదు. విద్యార్ధుల వయసు 13 నుంచి 15 సంవత్సరాల వయస్సులో కలిగిన 8వ తరగతి విద్యార్థులు అందరూ ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్ధుల ఎంపికకు రాష్ట్రస్థాయిలో రెండు పేపర్ల రాత పరీక్షలు నిర్వహిస్తారు.

ఆసక్తి కలిగిన విద్యార్ధులు నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌ (NSP) ద్వారా నేరుగా ఆన్‌లైన్‌లో ఆగస్టు 8, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్షల్లో ప్రతిభకనబరచిన విద్యార్ధుల బ్యాంకు ఖాతాలో ఏడాదికి రూ.12 వేలు చొప్పున డైరెక్ట్ గా స్కాలర్‌షిప్ జమ చేస్తారు. ఈ స్కాలర్‌షిప్ అత్యధికంగా 4 సంవత్సరాల పాటు అంటే తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రభుత్వం అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

రాత పరీక్ష విధానం..

పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (మ్యాట్‌) 90 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 90 మార్కులకు పరీక్ష ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉండదు. పేపర్‌ 2 స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (శాట్‌) 90 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు ఉంటుంది. మొత్తం 90 మార్కులకు పరీక్ష ఉంటుంది. 7, 8 తరగతుల స్థాయిలో సోషల్‌, సైన్స్, మ్యాథ్స్‌ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ పేపర్‌కు కూడా నెగెటివ్ మార్కింగ్ ఉండదు. మ్యాట్‌ & శాట్‌ పరీక్షల్లో కనీసం 40 శాతం మార్కులతో అర్హత సాధించాలి. ఎస్సీ/ఎస్టీలు 32శాతం సాధించాలి.

నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ 2025 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.