JEE Main 2026 Result Date: జేఈఈ మెయిన్ సెషన్ 1 ఫలితాల విడుదల వాయిదా.. కొత్త తేదీ ఇదే!
JEE Main 2026 Session 1 Result Date and Time: దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీల్లో, టాప్ ట్రిపుల్ఐటీల్లో బీటెక్లో చేరేందుకు, ఐఐటీల్లో చేరేందుకు జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కు అర్హత పొందేందుకు నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ మెయిన్) 2026 సెషన్ 1 పరీక్షల ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) JEE మెయిన్ ఫలితాల విడుదల తేదీని ప్రకటించింది..

హైదరాబాద్, ఫిబ్రవరి 12: NTA ప్రకారం, JEE మెయిన్ సెషన్ 1 ఫలితాలు ఇప్పుడు ఫిబ్రవరి 16న విడుదల కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం JEE మెయిన్ ఫలితాలు ఫిబ్రవరి 12న విడుదల చేయాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ తేదీని ఎన్టీయే మార్చింది. దీంతో జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు ఫిబ్రవరి 16వ తేదీన వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది NTA JEE మెయిన్ 2026 సెషన్ 1 పరీక్షలను జనవరి 21 నుంచి జనవరి 29 వరకు మొత్తం 10 షిఫ్టుల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. BArch , BPlanningకు నిర్వహించిన పేపర్ 2 పరీక్ష జనవరి 29న జరిగింది. ఈ పరీక్షలకు 13 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు.
పరీక్ష ముగిసిన అనంతరం ఫిబ్రవరి 4న తాత్కాలిక సమాధాన కీ విడుదల చేశారు. విద్యార్థులు ఫిబ్రవరి 6 వరకు అభ్యంతరాలను సమర్పించారు. ఈ అభ్యంతరాలను సబ్జెక్ట్ నిపుణులు సమీక్షించి, ఆ తర్వాత తుది సమాధాన కీ, ఫలితాలు విడుదల చేయనున్నారు. ఎన్టీయే విడుదల చేసే స్కోర్ కార్డులో జేఈఈ మెయిన్ మార్కులే కాకుండా పర్సంటైల్ స్కోర్ కూడా ఉంటుంది. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ల కోసం వ్యక్తిగత పర్సంటైల్లు, అలాగే మొత్తం పర్సంటైల్ స్కోర్ కూడా ఉంటాయి. అయితే ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) మాత్రం జేఈఈ మెయిన్ సెషన్ 1 ఫలితాల్లో విడుదల చేయరు. జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ (సెషన్ 2) తర్వాత మాత్రమే ర్యాంకులు వెలువరిస్తారు.
Result Update : JEE (Main) Session 1#NTA #JEEMain2026 #ExamUpdates pic.twitter.com/iUWzDMAcE9
— National Testing Agency (@NTA_Exams) February 11, 2026
నార్మలైజేషన్ ఉంటుందా?
జేఈఈ పరీక్షలు వివిధ షిఫ్టుల్లో జరుగుతాయి. అందువల్ల ప్రతి షిఫ్టులో ప్రశ్నపత్రం క్లిష్టత స్థాయి మారుతుంది. దీంతో NTA మార్కుల వెల్లడిలో నార్మలైజేషన్ పద్ధతిని ఉపయోగిస్తుంది. జేఈఈ మెయిన్ సెషన్ 1 స్కోర్లతో సంతృప్తి చెందనివారితోపాటు మొదటి సెషన్కు హాజరుకాని విద్యార్థులు జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ గడువు ఫిబ్రవరి 25తో ముగుస్తుంది. ఈ రెండు సెషన్లలలో టాప్ 2.5 లక్షల మంది అభ్యర్థులు IITలలో ప్రవేశం కల్పించే JEE అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి అర్హత సాధిస్తారు. JEE మెయిన్ 2026 సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 9 వరకు రోజుకు రెండు షిఫ్టులలో జరుగుతాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




