JEE Advanced 2026 Deadline: మళ్లీ తెరచుకున్న జేఈఈ అడ్వాన్స్డ్ అప్లికేషన్ విండో.. ఇదే చివరి ఛాన్స్!
దేశంలోని ప్రముఖ ఐఐటీ (IITs)ల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఆన్లైన్ దరఖాస్తు గడువు పొడిగిస్తూ ఐఐటీ రూర్కీ ప్రకటన వెలువరించింది. గతంలో జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం మే 2వ తేదీతో రిజిస్ట్రేషన్ల గడువు ముగిసింది. అయితే విద్యార్ధుల విజ్ఞప్తుల మేరకు ఐఐటీ రూర్కీ దరఖాస్తు గడువును పొడిగించింది..

హైదరాబాద్, మే 5: తాజా ప్రకటన ప్రకారం మే 5వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు విద్యార్ధులు జేఈఈ అడ్వాన్స్డ్కు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జేఈఈ మెయిన్స్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియతో పాటు ఫీజు చెల్లింపు కూడా ఈ సమయంలోపు పూర్తి చేయాల్సి ఉంటుందని ఐఐటీ రూర్కీ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని విద్యార్ధులకు ఇదే చివరి అవకాశమని, మరోమారు పొడిగింపు ఉండబోదని, ముగింపు సమయంలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
జేఈఈ అడ్వాన్స్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష మొత్తం 2 పేపర్లకు ఉంటుంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తప్పనిసరిగా రెండు పేపర్లకు హాజరుకావల్సి ఉంటుంది. పేపర్ 1 పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు జరుగుతుంది. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు జూన్ 1, 2026 ఉదయం 10 గంటలకు ఎన్టీయే విడుదల చేస్తుంది. అనంతరం జోసా కౌన్సెలింగ్ జూన్ 2 నుంచి మొదలవుతుంది.
ముఖ్యమైన తేదీలు ఇవే..
- జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: మే 5, 2026 రాత్రి 11:59 గంటల వరకు
- జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష తేదీ: మే 17, 2026 (ఆదివారం)
- ఫలితాలు వెల్లడి తేదీ: జూన్ 1, 2026.
- జోసా కౌన్సెలింగ్ ప్రారంభం: జూన్ 2, 2026 నుంచి
జేఈఈ అడ్వాన్స్డ్లో ఉత్తీర్ణులైన వారికి ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ 2026) ఉంటుంది. ఈ పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తులు జూన్ 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఏఏటీ 2026 పరీక్ష జూన్ 4వ తేదీ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. జూన్ 7న ఏఏటీ 2026 పరీక్ష ఫలితాలు విడుదలవుతాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




