తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్..! ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యం నిబంధనపై బోర్డ్ కీలక ప్రకటన
Telangana Inter Exams 2026: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు బోర్డ్ గుడ్న్యూస్ చెప్పింది. ‘ఒక నిమిషం నిబంధన’ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని, ఐదు నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన వారికి కూడా అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. విద్యార్థులను ఉదయం 9.05 గంటల వరకు కేంద్రాలలోకి అనుమతిస్తారు. అయినప్పటికీ, చివరి నిమిషం వరకు ఆలస్యం చేయకుండా ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించారు.

తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జూనియర్ కాలేజీలు సిలబస్ పూర్తి చేశాయని సంబంధిత అధికారులు తెలిపారు. హాల్ టికెట్ల జారీపై వచ్చిన సందేహాలకు కూడా స్పష్టత ఇచ్చినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి, ఐఏఎస్ అధికారి కృష్ణాదిత్య ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసేలా ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టిందన్నారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు షెడ్యూల్ ప్రకటించారు.
అధిక సెంటర్లు
ఈసారి మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అందులో ప్రథమ సంవత్సరం నుంచి 4,89,126 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 5,07,949 మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 863 ప్రైవేట్ కాలేజీలు, 404 ప్రభుత్వ కళాశాలలు, 221 ఎయిడెడ్ కాలేజీలు, మరో 7 ఇతర విద్యాసంస్థలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రైవేట్ కాలేజీల్లో అధిక సంఖ్యలో సెంటర్లు ఏర్పాటు చేశారు.
సీసీ కెమెరా నిఘా..
మాస్ కాపీయింగ్ను అరికట్టేందుకు అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటి పర్యవేక్షణకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి కనీసం అరగంట ముందే చేరుకోవాలని సూచించారు.
ఒక నిమిషం నిబంధన తొలగింపు, కానీ..
అలాగే ‘ఒక నిమిషం నిబంధన’ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని, ఐదు నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన వారికి కూడా అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. విద్యార్థులను ఉదయం 9.05 గంటల వరకు కేంద్రాలలోకి అనుమతిస్తారు.
అయినప్పటికీ, చివరి నిమిషం వరకు ఆలస్యం చేయకుండా ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు, పరీక్ష పూర్తి అయినప్పటికీ, విద్యార్థులను బయటకు పంపరాదని స్పష్టం చేశారు. అలాగే ప్రశ్నాపత్రాలు కూడా ఆ సమయం వరకు బయటకు తీసుకెళ్లరాదని తెలిపారు.
ఫీజులు చెల్లించలేదనే కారణంతో ఎవరూ ఇబ్బంది పడకూడదని, ప్రతి విద్యార్థికి హాల్ టికెట్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టామని కార్యదర్శి తెలిపారు. విద్యార్థులు ధైర్యంగా, నిశ్చింతగా పరీక్షలకు హాజరవాలని బోర్డు కోరింది.
