
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL).. 2026 సంవత్సరానికి గానూ వివిధ విభాగాలలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 739 జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఇంజినీర్, ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్లైన్ విధానంలో మార్చి 25, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రెషర్లతో పాటు అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టుల్లో మెకానికల్ ఇంజనీర్ 72 పోస్టులు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ 37 పోస్టులు, సివిల్ ఇంజనీర్ 17 పోస్టులు, కెమికల్ ఇంజనీర్ 15 పోస్టుల వరకు ఖాళీలు ఉన్నాయి. అనుభవం ఉన్న వారిని సీబీజీ ఆపరేషన్స్, సేఫ్టీ, సేల్స్, లా, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ వంటి విభాగాల్లో సీనియర్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ స్థాయి పోస్టుల్లో భర్తీ చేస్తారు. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్ ఇంజనీరింగ్ విభాగాలతో పాటు ఫైనాన్స్, హెచ్ఆర్, క్వాలిటీ కంట్రోల్, ఫైర్ అండ్ సేఫ్టీ వంటి విభాగాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీఏ, సీఏ, సీఎంఏ, ఎంఎస్సీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్లో సూచించిన విధంగా పని అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్లైన్ విధానంలో మార్చి 25, 2026వ తేదీ రాత్రి 11.59 గంటల లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1180 చొప్పున చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులకు మాత్రం ఎలాంటి ఫీజు లేదు. ఆన్లైన్ రాత పరీక్ష, గ్రూప్ టాస్క్, సైకోమెట్రిక్ అసెస్మెంట్, పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష మే 3, 2026న నిర్వహించనున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.30,000 నుంచి రూ.2,80,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగాల దరఖాస్తుకు ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.