
అమరావతి, జూన్ 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 4వ తేదీతో ముగిశాయి. మే 25వ తేదీన మొదలైన ఈ పరీక్షలు జూన్ 4వ తేదీ వరకు కొనసాగాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులు హాజరయ్యారు. ఇక పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం (జూన్ 8) నుంచి మొదలవనుంది. జూన్ 10 వరకు మూల్యాంకనం నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు శ్రీనివాసులురెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
Also read: మొసళ్లు, సింహం, పాము.. ఆ వ్యక్తి ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? మీ తెలివికి సవాల్ విసిరే చిక్కుప్రశ్న
రాష్ట్రవ్యాప్తంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు మినహా మిగతా 24 జిల్లాల్లోనూ మూల్యాంకనం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఉదయం 8 గంటలకు విధిగా పది స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల్లో ఏఈలు, సీఈలు, స్పెషల్ అసిస్టెంట్లు రిపోర్టు చేయవల్సి ఉంటుందని తెలిపారు. ఈ మేరకు బోర్డు నిర్ణయించిన నిర్ణీత సమయంలో మూల్యాంకన పూర్తి చేసేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు డ్యూటీ ఉత్వర్వులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇక పదో తరగతి సప్లిమెంటరీ జవాబు పత్రాల మూల్యాంకనం అనంతరం త్వరలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు.
మరోవైపు ఏపీలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డు సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఆదివారం నుంచి ప్రారంభమైంది. ఆదివారం తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సంస్కృతం, చరిత్ర, గణితం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, మైనర్ లాంగ్వేజెస్ మైనర్ మీడియా సబ్జెక్టులకు మూల్యాంకనం జరగనుంది. సోమవారం కామర్స్, సివిక్స్, ఎకనామిక్స్ మూల్యాంకనం ప్రారంభమవుతుంది. సంబంధిత అసిస్టెంట్ ఎగ్జామినర్స్, చీఫ్ ఎగ్జామినర్స్ ఉదయం 9.30 గంటలకు విధిగా హాజరు కావాల్సి ఉంటుంది. వాల్యుయేషన్ విధులకు ఉత్తర్వులు వచ్చిన అధ్యాపకులు తక్షణమే రిలీవ్ చేసి వారిని నిర్దేశిత తేదీల్లో శిబిరానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ఈ నెల 18 నాటికి విడుదల చేయాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.