
అమరావతి, ఏప్రిల్ 25: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది పదో తరగతి విద్యార్ధులు పబ్లిక్ పరీక్షల ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BSEAP) కీలక అప్డేట్ జారీ చేసింది. ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈ నెలలోనే విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఏప్రిల్ చివరి నాటికి పదో తరగతి ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని బోర్డ్ తెలిపింది. విద్యార్థులు తమ రోల్ నంబర్ను అధికారిక వెబ్సైట్లో results.bse.ap.gov.in లేదా bse.ap.gov.inలలో నమోదు చేసి ఫలితాలను పొందవచ్చు. అలాగే టీవీ9 తెలుగు వెబ్సైట్లోనూ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఇక వాట్సప్ గవర్నెన్స్ ‘మన మిత్ర’. ‘LEAP’ మొబైల్ యాప్ ద్వారా కూడా విద్యార్ధులు ఫలితాలను తెలుసుకోవచ్చు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 6,40,916 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో బాలురు 3,28,652 మంది, బాలికలు 3,12,264 మంది వరకు ఉన్నారు. మొత్తం 3,415 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. ఇటీవల మూల్యాంకనం కూడా ముగియడంతో విద్యార్ధులంతా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.