SSC Public Exams 2025: రేపట్నుంచే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు.. 7 పేపర్లకు 9 రోజులపాటు ఎగ్జామ్స్!

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం (మార్చి 17) నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ హాల్ టికెట్లను కూడా జారీ చేసింది. గతంలో తీసుకొచ్చిన ఆంగ్ల మాధ్యమంతోపాటు ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌తో తొలిసారి ఈ పరీక్షలు జరుగుతున్నాయి. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి..

SSC Public Exams 2025: రేపట్నుంచే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు.. 7 పేపర్లకు 9 రోజులపాటు ఎగ్జామ్స్!
SSC Public Exams

Updated on: Mar 16, 2025 | 7:39 PM

అమరావతి, మార్చి 16: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం (మార్చి 17) నుంచి ప్రారంభంకానున్నాయి. పాఠశాల విద్యలో తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా తొలిసారి ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. గతంలో తీసుకొచ్చిన ఆంగ్ల మాధ్యమంతోపాటు ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌తో ఈ పరీక్షలు రాయనున్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఫిజికల్‌ సైన్స్, బయలాజీకల్‌ సైన్స్ పేపర్లకు మాత్రం ఒక్కోరోజు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆంగ్ల మాధ్యమంలో 5,64,064 మంది విద్యార్ధులు, తెలుగు మాధ్యమంలో 51,069 మంది విద్యార్ధులు ఈ పరీక్షలు రాయనున్నారు. రెగ్యులర్‌ విద్యార్థులతోపాటు సార్వత్రిక విద్యాపీఠం విద్యార్ధులకు కూడా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సార్వత్రిక విద్యార్ధులు 30,334 మంది హాజరుకానున్నారు.

గత ప్రభుత్వంలో 2020-21లో ఒకేసారి 1-6 తరగతులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చి, ఆ తర్వాత ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ను తీసుకొచ్చారు. అంటే అప్పట్లో ఆరో తరగతిలో ఉన్న విద్యార్థులు ఇప్పుడు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారన్నమాట. కొన్ని చోట్ల తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను కొనసాగించారు. దీంతో మొత్తం 6,19,275 మంది రెగ్యులర్‌ విద్యార్థుల్లో 8.2% మంది తెలుగు మాధ్యమం విద్యార్ధులు ప్రస్తుతం పబ్లిక్‌ పరీక్షలు రాయబోతున్నారు. సాధారణంగా NCERT సిలబస్‌ అమలు చేసే సీబీఎస్‌ఈ బోర్డులో 20 శాతం ఇంటర్నల్‌ మార్కులు ఉంటాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ అమలుచేసినా వంద మార్కులకు పరీక్ష రాస్తున్నారు.

వచ్చే విద్యాసంవత్సరం నుంచి 20 శాతం ఇంటర్నల్‌ మార్కులను అమల్లోకి తీసుకురానున్నారు. అంతేకాకుండా సీబీఎస్‌ఈలో పదో తరగతిలో ఐదు సబ్జెక్టులు మాత్రమే ఉండగా.. రాష్ట్రంలో విద్యార్థులు ఆరు సబ్జెక్టులు చదువుతున్నారు. దీంతో పదో తరగతి పరీక్షలు ఏడు పేపర్లకు (సైన్స్‌లో భౌతిక, రసాయనశాస్త్రాలు కలిపి ఒక పేపర్‌, జీవశాస్త్రం మరో పేపర్‌) విధానంలో జరగనున్నాయి. అలాగే విద్యార్ధులకు జవాబులు రాసేందుకు 24 పేజీల బుక్‌లెట్‌ ఇస్తారు. అదనంగా కావాలంటే మరో 12 పేజీల బుక్‌లెట్‌ కూడా ఇస్తారు. ఇప్పటికే పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నా్యి. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 156 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 682 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణలో ఎప్పట్నుంచంటే..

మరోవైపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు 21 నుంచి ప్రారంభమై ఏప్రిల్‌ 4 వరకు జరగనున్నాయి. జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్‌ 7 నుంచి 15వ తేదీ వరకు జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు శనివారం (మార్చి15న) ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది మొత్తం 19 చోట్ల మూల్యాంకనం జరగనుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us