Andhra Pradesh: టెన్త్, ఇంటర్‌లో భారీగా ‘రీ అడ్మిషన్లు’.. పరీక్ష తప్పినా ‘రెగ్యులర్‌’ విద్యార్థులుగా పబ్లిక్‌ పరీక్షలు రాసే అవకాశం

|

Jan 02, 2024 | 8:47 AM

గత ఏడాది (2022­23) పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ ఫెయిలైన విద్యార్థులకు ప్రభుత్వం ‘రీ అడ్మిషన్‌’ అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. ఈ అవకాశాన్ని భారీ సంఖ్యలో విద్యార్ధులు వినియోగించుకున్నారు. సుమారు 1,93,251 మంది తిరిగి ఆయా తరగతుల్లో ప్రవేశాలు పొందారు. వీరికి ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పొందిన రెగ్యులర్‌ విద్యార్థులతో సమానంగా అన్ని అవకాశాలు కల్పించనున్నారు..

Andhra Pradesh: టెన్త్, ఇంటర్‌లో భారీగా ‘రీ అడ్మిషన్లు’.. పరీక్ష తప్పినా ‘రెగ్యులర్‌’ విద్యార్థులుగా పబ్లిక్‌ పరీక్షలు రాసే అవకాశం
Re Admitted Students
Follow us on

అమరావతి, జనవరి 2: గత ఏడాది (2022­23) పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ ఫెయిలైన విద్యార్థులకు ప్రభుత్వం ‘రీ అడ్మిషన్‌’ అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. ఈ అవకాశాన్ని భారీ సంఖ్యలో విద్యార్ధులు వినియోగించుకున్నారు. సుమారు 1,93,251 మంది తిరిగి ఆయా తరగతుల్లో ప్రవేశాలు పొందారు. వీరికి ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పొందిన రెగ్యులర్‌ విద్యార్థులతో సమానంగా అన్ని అవకాశాలు కల్పించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నూరు శాతం గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌) సాధనలో భాగంగా 10వ తరగతి, ఇంటర్‌ తప్పిన విద్యార్ధులకు అదే తరగతుల్లో పునర్‌ ప్రవేశ అవకాశం కల్పించింది.

గ్రామ వలంటీర్ల ద్వారా ఆయా విద్యార్థులను తిరిగి ఎన్‌రోల్‌ చేశారు. దీంతో 2022­23 విద్యా సంవత్సరంలో పదో తరగతి తప్పిన 1,23,680 మందిలో 1,03,000 మంది మళ్లీ ప్రవేశాలు పొందారు. ఇంటర్‌లో 90,251 మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. సాధారణంగా పరీక్ష తప్పినవారు తిరిగి ఫీజు కట్టి సప్లిమెంటరీ పరీక్షలు రాసేవారు. వారిని ‘ప్రైవేటు’ విద్యార్థులుగా బోర్డు పరిగిణిస్తుంది. అయితే రీ అడ్మిషన్‌ తీసుకుంటే మాత్రం రెగ్యులర్‌ విద్యార్థులుగానే పరిగణిస్తారు. అయితే వారు ఫెయిల్‌ అయిన సబ్జెక్టులతోపాటు అన్ని సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. పబ్లిక్‌ పరీక్షల్లో అన్ని పేపర్లకు పరీక్ష రాయాల్సి ఉంటుంది. అయితే, మార్కులు కేటాయించేటప్పుడు మాత్రం గత విద్యా సంవత్సరంలో సాధించిన మార్కులు, ప్రస్తుత విద్యా సంవత్సరంలో మార్కులను పరిశీలించి.. ఆయా సబ్జెక్టుల్లో ఏ విద్యా సంవత్సరంలో ఎక్కువ మార్కులు వస్తే వాటినే అంతిమంగా పరిగణనలోకి తీసుకుంటారు.

ఇక బోర్డు జారీ చేసే సర్టీఫికెట్లపై ప్రైవేట్‌ లేదా కంపార్ట్‌మెంటల్‌ లేదా స్టార్‌ గుర్తు వంటివి లేకుండా ‘రెగ్యులర్‌ సర్టీఫికెట్‌’ వీరికి అందిస్తుంది. వీరికి కూడా జగనన్న విద్యాకానుక, అమ్మ ఒడి వంటి అన్ని పథకాలు వర్తిస్తాయి. ఇలా పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ ఫెయిలైన వారికి ఒక్క ఏడాది మాత్రమే రీ అడ్మిషన్‌తో పాటు అన్ని రెగ్యులర్‌ ప్రభుత్వ పథకాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ విద్యార్థులు రెండో సారి కూడా ఫెయిలైతే వారికి మరో అవకాశం ఉండదు. ప్రైవేటుగానే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. గతేడాది ఇంటర్మీడియెట్, పదో తరగతి ఫెయిలై తిరిగి రెగ్యులర్‌ గుర్తింపు పొందిన 1,93,251 మంది విద్యార్థులు వచ్చే మార్చిలో పరీక్షలు రాయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.