విప్రోలో వింత.. కంపెనీ ఛైర్మన్ కంటే CEOకు 7 రెట్లు జీతం ఎక్కువ! ఒక్క ఏడాదిలోనే..
విప్రో సీఈఓ, ఎండీగా ఉన్న శ్రీనివాస్ పల్లియా 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.49.6 కోట్ల వేతన ప్యాకేజీ పొందారు. గత ఏడాదితో పోలిస్తే ఆయన రెమ్యునరేషన్ తగ్గినప్పటికీ, సంస్థలో అత్యధిక వేతనం పొందిన అధికారిగా నిలిచారు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కంటే ఆయన ఆదాయం దాదాపు ఏడు రెట్లు ఎక్కువగా ఉంది.

దేశంలోని ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ పల్లియా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.49.6 కోట్ల జీతం అందుకున్నట్లు కంపెనీ తాజా వార్షిక నివేదిక వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఆయనకు రూ.53.6 కోట్ల వేతన ప్యాకేజీ లభించగా, ఈ ఏడాది ఆ మొత్తం కొంత తగ్గింది. పర్ఫార్మెన్స్-లింక్డ్ కాంపెన్సేషన్లో కోత విధించడం వల్లే ఈ తగ్గుదల చోటుచేసుకున్నట్లు సంస్థ పేర్కొంది.
వేతనం తగ్గినప్పటికీ, విప్రోలో అత్యధిక పారితోషికం అందుకున్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా శ్రీనివాస్ కొనసాగుతున్నారు. ముఖ్యంగా సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషాద్ ప్రేమ్జీతో పోలిస్తే ఆయన ఆదాయం దాదాపు ఏడు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రిషద్ ప్రేమ్జీ రూ.7.3 కోట్ల వేతన ప్యాకేజీని పొందగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఆయనకు రూ.13.8 కోట్ల పారితోషికం లభించింది.
2024 ఏప్రిల్లో శ్రీనివాస్ విప్రో సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. మార్కెట్ విలువ పరంగా దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా ఉన్న విప్రో గత కొంతకాలంగా వ్యాపార సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, ఖాతాదారుల ఖర్చుల నియంత్రణ, ఐటీ సేవల డిమాండ్లో మందగమనం వంటి కారణాల ప్రభావం సంస్థ పనితీరుపై పడింది. ఈ నేపథ్యంలో సంస్థ వ్యయ నియంత్రణ చర్యలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం విప్రో మాత్రమే కాకుండా దేశంలోని ఇతర ప్రధాన ఐటీ కంపెనీలు కూడా ఆదాయ వృద్ధి మందగించడం వల్ల ఖర్చులపై కట్టుదిట్టమైన నియంత్రణ పాటిస్తున్నాయి. ఉద్యోగ నియామకాలు, వేతన పెంపులు, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
