
దుబాయ్లో ఇటీవల జరిగిన తేజస్ యుద్ధ విమానం కూలిపోవడం అసాధారణ పరిస్థితులలో జరిగిన సంఘటన అని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) పేర్కొంది. దుబాయ్ ఎయిర్ షోలో వైమానిక ప్రదర్శన సందర్భంగా విమానం కూలిపోవడంతో భారత వైమానిక దళం (IAF) అధికారి ప్రాణాలు కోల్పోయిన మూడు రోజుల తర్వాత కంపెనీ ఈ ఈ విధంగా స్పందించింది. శుక్రవారం నాడు ఈ సంఘటన జరిగింది, ఈ కార్యక్రమంలో ప్రేక్షకుల ముందు తేజస్ ఫైటర్ జెట్ కూలిపోయి మంటలు చెలరేగాయి. ప్రమాదానికి గల కారణాన్ని కోర్టు విచారణ చేపడుతుందని IAF ఇప్పటికే తెలిపింది. విదేశాలలో భారతదేశ రక్షణ ప్రదర్శనలో తేలికపాటి యుద్ధ విమానం కీలక పాత్ర పోషించినందున, ఈ ప్రమాదం ఎయిర్ షో సందర్శకులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
సోమవారం తన ప్రకటనలో HAL ఈ ప్రమాదాన్ని విమానం మొత్తం పనితీరు రికార్డు ప్రతిబింబంగా చూడకూడదని పేర్కొంది. జనరల్ ఎలక్ట్రిక్ ఇంజిన్లతో నడిచే తేజస్ను నిర్మించే కంపెనీ, దాని రోజువారీ కార్యకలాపాలు లేదా భవిష్యత్ డెలివరీలపై ఎటువంటి ప్రభావం చూపదని అంచనా వేసింది. దుబాయ్ ఎయిర్ షోలో వైమానిక ప్రదర్శన సందర్భంగా ఇటీవల జరిగిన సంఘటన అసాధారణ పరిస్థితుల వల్ల తలెత్తిన ఒక వివిక్త సంఘటన అని మేం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం. కంపెనీ వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక పనితీరు లేదా దాని భవిష్యత్తు డెలివరీలపై ఎటువంటి ప్రభావం ఉండదని మేము హామీ ఇస్తున్నాం. దర్యాప్తు నిర్వహిస్తున్న ఏజెన్సీలకు కంపెనీ తన పూర్తి మద్దతు, సహకారాన్ని అందిస్తోంది అని HAL BSEకి దాఖలు చేస్తూ పేర్కొంది.
ఈ క్రాష్ తర్వాత HAL షేర్లు క్షీణించాయి. గత ఐదు రోజుల్లో ఈ స్టాక్ 8 శాతం పడిపోయింది. సోమవారం మధ్యాహ్నం 1:40 గంటలకు 3.14 శాతం తగ్గి రూ.4,450.70 వద్ద ట్రేడవుతోంది. దుబాయ్ ఎయిర్షో 2025లో పాల్గొంటున్న భారత వైమానిక దళానికి చెందిన తేజస్ ఫైటర్ జెట్ శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కూలిపోయింది. దుబాయ్ ఎయిర్ షో సందర్భంగా జరిగిన తేజస్ విమాన ప్రమాదంలో పైలట్ను కాంగ్రాకు చెందిన స్క్వాడ్రన్ లీడర్ నమన్ సయాల్గా గుర్తించారు. దుబాయ్ వరల్డ్ సెంట్రల్లోని అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రేక్షకుల కోసం ఎయిర్ షో ఇస్తుండగా స్థానిక సమయం మధ్యాహ్నం 2:10 గంటల ప్రాంతంలో తేజస్ జెట్ కూలిపోయింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి