AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: స్టాక్ మార్కెట్‌లో రూ.5 లక్షల కోట్లు హుష్..!

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత స్టాక్ మార్కెట్లు ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. బుధ, గురువారాల్లో లాభాల్లో క్లోజ్ అయిన సూచీలు.. శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 330 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 113 పాయింట్లు క్షీణించింది. మొత్తానికి శుక్రవారం ఒక్క రోజే స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్లు ఆవిరయ్యింది.

Stock Market: స్టాక్ మార్కెట్‌లో రూ.5 లక్షల కోట్లు హుష్..!
Stock Market
Janardhan Veluru
|

Updated on: Jan 24, 2025 | 5:01 PM

Share

Stock Market Today: భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారం కూడా నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాలతో ముగియడం ఇది వరుసగా మూడో వారం. బుధ, గురువారాల్లో లాభాల్లో ముగిసిన సూచీలు.. శుక్రవారంనాడు (జనవరి 24) నష్టాల్లోకి జారకున్నాయి. సెన్సెక్స్ 330 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ కూడా 23,100 పాయింట్ల దిగువకు క్షీణించింది. దీంతో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంపద శుక్రవారం ఒక్క రోజే దాదాపు రూ.5 లక్షల కోట్ల మేర ఆవిరయ్యింది.

బీఎస్ఈ సెన్సెక్స్ 330 పాయింట్ల నష్టంతో 76,190 పాయింట్ల దగ్గర క్లోజ్ అయ్యింది. ఎన్ఎస్‌ఈ 113 పాయింట్ల నష్టంతో 23,092 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తానికి ఈ వారంలో జనవరి 20 నుంచి జనవరి 24 వరకు సెన్సెక్స్, నిఫ్టీ 0.5 శాతం క్షీణితను నమోదు చేసుకుంది. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 4 శాతం నష్టపోయింది.

మొత్తానికి బీఎస్ఈ‌లో లిస్ట్ అయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ జనవరి 23న రూ.424.63 లక్షల కోట్లుగా ఉండగా.. జనవరి 24న రూ.419.61 లక్షల కోట్లకు తగ్గింది. దీంతో మదుపర్ల సంపద శుక్రవారం ఒక్క రోజే ఏకంగా రూ.5.02 లక్షల కోట్లు తగ్గింది.

బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఏకంగా 1.6 శాతం నష్టంతో ముగియగా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.23 శాతం క్షీణితతో క్లోజ్ అయ్యింది. ఎఫ్ఎంసీజీ మినహా బీఎస్‌ఈలోని అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి.

అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన ట్రంప్.. పొరుగు దేశాలతో పాటు భారత్ తదితర దేశాలపై అధిక దిగుమతి సుంకాలు విధించే అవకాశముందని అంచనావేస్తున్నారు. దీంతో భారత స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కొందరు మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడం కూడా స్టాక్ మార్కెట్ల నష్టానికి కారణం అవుతోంది.