ఇటీవల కాలంలో తీవ్ర ఒడిదుడుకుల్లో కొట్టుమిట్టాడుతోన్న దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ ఒక్కసారిగా భారీ లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 1,778.. నిఫ్టీ 11,229 పాయింట్లకు పైగా ఎగబాగాయి. అయితే దేశంలో ఆర్థిక మాంద్యం తరహా పరిస్థితులతో పాటు దేశీయంగా ఆర్థిక వ్యవస్థ మందగమనం దిశగా వెళుతుండటంతో కేంద్రం రంగంలోకి దిగింది. వివిధ రంగాలకు ఊతమిచ్చే ప్రయత్నంలో భాగంగా కేంద్రం కార్పొరేట్ పన్నును తగ్గించింది. కార్పొరేట్ పన్ను తగ్గింపును 22 శాతానికి ప్రతిపాదిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఉదయం ఓ ప్రకటనను చేశారు. అలాగే సర్ఛార్జ్లు, సెస్ కలిపి కార్పొరేట్ పన్ను రేటు 25.17శాతానికి తగ్గింది. దీంతో స్టాక్ మార్కెట్లకు సానుకూల సంకేతాలు వెళ్లగా.. స్టాక్ మార్కెట్లు పుంచుకున్నాయి.
గురువారం నాటి ముగింపు ప్రకారం.. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ మార్కెట్ విలువ రూ.138.54లక్షల కోట్లుగా ఉంది. అయితే కేంద్ర ఆర్థికమంత్రి మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన వెంటనే మార్కెట్లు దూసుకెళ్లాయి. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత సెన్సెక్స్ ఏకంగా 1900 పాయింట్ల పైన ఎగబాకింది. ఫలితంగా బీఎస్ఈ మార్కెట్ విలువ రూ. 143.45లక్షల కోట్లకు పెరిగింది. అంటే కేవలం గంట వ్యవధిలోనే మదుపర్ల సంపద రూ.5లక్షల కోట్ల పైన పెరిగింది. అటు నిఫ్టీ కూడా 500 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్ అవుతోంది. గడిచిన దశాబ్ద కాలంలో నిఫ్టీ ఒక రోజులో ఇంత భారీగా లాభపడటం ఇదే తొలిసారి కావడం విశేషం.