ప్రియాంక చోప్రా కంపెనీని కొనేసిన అంబానీ! కీలక ప్రకటన విడుదల
భారతదేశ అతిపెద్ద రిటైల్ సంస్థలలో ఒకటైన రిలయన్స్ రిటైల్, నటి ప్రియాంక చోప్రా స్థాపించిన గ్లోబల్ హెయిర్కేర్ బ్రాండ్ 'అనామలీ'ని కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం ద్వారా, అనామలీ బ్రాండ్ ఇప్పుడు రిలయన్స్ బ్యూటీ ప్లాట్ఫారమ్ 'తిరా' ద్వారా భారత్లో, అంతర్జాతీయంగా విస్తరిస్తుంది.

భారతదేశపు అతిపెద్ద రిటైల్ సంస్థలలో ఒకటైన రిలయన్స్ రిటైల్ బ్యూటీ, పర్సనల్ కేర్ రంగంలో తన విస్తరణను మరింత వేగవంతం చేస్తూ కీలక ఒప్పందాన్ని ప్రకటించింది. నటి, వ్యాపారవేత్త ప్రియాంక చోప్రా స్థాపించిన గ్లోబల్ హెయిర్కేర్ బ్రాండ్ ‘అనామలీ (Anomaly)’ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఒప్పందం ద్వారా బ్రాండ్కు సంబంధించిన ట్రేడ్మార్క్లు, డిజిటల్ ప్లాట్ఫారమ్లు, ఇతర మేధో సంపత్తి హక్కులు పూర్తిగా రిలయన్స్ రిటైల్ ఆధీనంలోకి వచ్చాయి. అయితే ఒప్పంద విలువను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.
2021లో ప్రారంభమైన అనామలీ బ్రాండ్ తక్కువ ధరల్లో రసాయన రహిత, వేగన్ హెయిర్కేర్ ఉత్పత్తులను అందిస్తూ అంతర్జాతీయ మార్కెట్లలో మంచి గుర్తింపు సంపాదించింది. ఈ బ్రాండ్ ఇప్పుడు రిలయన్స్ బ్యూటీ ప్లాట్ఫారమ్ Tira ద్వారా భారత్లో, విదేశాల్లో విస్తరించనుంది. కంపెనీ ప్రకటన ప్రకారం భారతదేశమే ఈ బ్రాండ్కు ప్రధాన మార్కెట్గా ఉండనుంది. అలాగే ఉత్తర అమెరికా, యూకే, మధ్యప్రాచ్య దేశాల్లో కూడా విస్తరణ ప్రణాళికలు ఉన్నాయి.
ఇషా అంబానీ ఈ ఒప్పందాన్ని వ్యూహాత్మకంగా ముఖ్యమైన అడుగుగా అభివర్ణించారు. అనామలీ నాణ్యత, అందుబాటు ధరలు, గ్లోబల్ ఆకర్షణ బ్రాండ్ వృద్ధికి దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు. వినియోగదారుల డేటా, మార్కెట్ అంతర్దృష్టులను ఉపయోగించి కొత్త ఉత్పత్తుల అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. ఇక ప్రియాంక చోప్రా ఈ బ్రాండ్లో క్రియేటివ్ డైరెక్టర్గా కొనసాగనున్నారు. ఉత్పత్తి రూపకల్పన, కొత్త ఆలోచనలు, బ్రాండ్ దిశలో ఆమె కీలక పాత్ర పోషిస్తారని కంపెనీ తెలిపింది. ఈ భాగస్వామ్యం ద్వారా అనామలీ మరింత విస్తృత వినియోగదారుల వర్గానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
