
రాబోయే నెలలు రుణగ్రహీతలకు కష్ట కాలంగా చెప్పాలి..ఎందుకంటే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్లో రెపో రేటును పెంచడానికి సిద్ధమవుతోంది. అక్టోబర్ సమావేశంలో రెపో రేటును 0.25 శాతం పెంచాలని ఎస్బిఐ రీసెర్చ్ తన నివేదికలో పేర్కొంది. డిసెంబర్లో కూడా ఇలాంటి పెంపు అవసరం కావచ్చు. ఒకవేళ ఇది జరిగితే, గృహ రుణాలు, వాహన రుణాలు, ఇతర ఫ్లోటింగ్-రేట్ రుణాలపై వడ్డీ రేట్లు, ఈఎంఐలు పెరిగే అవకాశం ఉంది. అయితే, వడ్డీ రేట్ల పెంపు వల్ల డిపాజిటర్లకు ఒక శుభవార్త అందవచ్చు. రెపో రేటు పెరిగే కొద్దీ, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కూడా తమ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. దీని అర్థం, ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నవారు లేదా రాబోయే నెలల్లో డిపాజిట్ చేయాలని యోచిస్తున్నవారు గతంలో కంటే మెరుగైన వడ్డీ రేట్లను పొందవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే..
రెపో రేటు పెంపు వల్ల బ్యాంకుల నుండి రుణం తీసుకోవడం ఖరీదైనదిగా మారుతుంది. దీనివల్ల హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ తీసుకున్న వారి EMIలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే లోన్ తీసుకున్న వారు ఫ్లోటింగ్ రేట్ లో ఉంటే, వారి వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. కొత్త లోన్ తీసుకోవాలనుకునే వారు తమ బడ్జెట్ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి.
రెపో రేటు పెంపు FD దారులకు శుభవార్త. బ్యాంకులు తమ FDలపై వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. ఇది పొదుపు చేయాలనుకునే వారికి, పదవీ విరమణ చేసిన వారికి మెరుగైన రాబడిని అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు కూడా ఈ నిర్ణయం లాభదాయకంగా ఉంటుంది.
రెపో రేటు పెంపు వల్ల ఆర్థిక వ్యవస్థలో డబ్బు ప్రవాహం తగ్గుతుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంది. ఇది ధరలు పెరగడాన్ని అడ్డుకుంటుంది. సాధారణ ప్రజలకు ఊరటనిస్తుంది.
CAలు ఈ సమయంలో రుణం తీసుకోవడాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేయాలని, మెరుగైన FD రేట్ల కోసం ఇతర బ్యాంకుల ఆఫర్లను పోల్చి చూడాలని సలహా ఇస్తున్నారు. తమ ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి, సంపదను పెంపొందించుకోవడానికి చక్రవడ్డీ, ఆర్థిక పరిజ్ఞానం ముఖ్యమని వారు గుర్తుచేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..