RBI: ఆర్బీఐ హెచ్చరిక..! ఖాతాదారులు ఈ తప్పులు అస్సలు చేయకండి.. చాలా నష్టపోతారు..
RBI Cautions: రోజురోజుకీ సైబర్ దాడులు పెరుగుతూనే ఉన్నాయి. మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా నేరాల ట్రెండ్ కూడా మారుతోంది. కేవైసీ అప్డేట్ పేరుతో

RBI Cautions: రోజురోజుకీ సైబర్ దాడులు పెరుగుతూనే ఉన్నాయి. మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా నేరాల ట్రెండ్ కూడా మారుతోంది. కేవైసీ అప్డేట్ పేరుతో ఖాతాదారులను బురిడి కొట్టిస్తున్నారు. ఈ విషయమై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కి చాలా ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఆర్బీఐ వినియోగదారులకు పలు సూచనలను చేసింది. సైబర్ నేరగాళ్లు కస్టమర్లకు రకరకాల మెసేజ్లు సోషల్ మీడియాలో, మొబైళ్లకు పంపుతున్నారు. కేవైసీ చేయకపోతే 24 గంటల్లో మీ అకౌంట్ బ్లాక్ అవుతుందని హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి మెసేజ్లను నమ్మవద్దని ఆర్బీఐ హెచ్చరిస్తోంది. కేవైసీ వివరాలు అప్డేట్ చేయకపోతే బ్యాంకింగ్ సేవలు పూర్తి స్థాయిలో పొందలేరని రకరకాల మెసేజ్ లు వైరల్ చేస్తున్నారు. అంతేకాదు అందుకు కస్టమర్ కేర్ నెంబర్ కూడా ఇస్తున్నారు. ఆ నెంబర్కు ఫోన్ చేస్తే మీరు నేరగాళ్లు ఉచ్చులో పడినట్లే. జాగ్రత్తగా ఉండాలంటూ ఆర్బీఐ సూచిస్తోంది. ఖాతా లాగిన్ వివరాలు, వ్యక్తిగత సమాచారం, KYC పత్రాల కాపీలు, కార్డ్ సమాచారం, PIN నెంబర్, పాస్వర్డ్, OTP మొదలైన వాటిని అపరిచిత వ్యక్తులు, ఏజెన్సీలతో పంచుకోవద్దని హెచ్చరిస్తోంది. ఇంకా గుర్తింపు లేని వెబ్సైట్లు, అప్లికేషన్లను నమ్మవద్దని,మీకు ఒకవేళ KYC అప్డేట్ చేయమని సందేశం వస్తే మీరు మొదటగా బ్యాంక్ని సంప్రదించమని చెబుతోంది.
బ్యాంకు కస్టమర్లకు ఫోన్ చేసి KYC గురించి అడగదని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ ద్వారా, మెస్సేజ్ ద్వారా మీ ఖాతా వివరాలు తెలుసుకుంటే వెంటనే మీ ఖాతాలో ఉన్న డబ్బు మాయమవుతుందన్నారు. అంతేకాదు ఒక్కోసారి మీ ఖాతా ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉందన్నారు. కొన్నిసార్లు మీకు తెలియకుండానే మీ ఖాతను ఆక్సెస్ చేసే అవకాశం ఉంటుందన్నారు. అందుకే ఖాతాదారులు KYC అప్డేట్ గురించి కచ్చిత మైన సమాచారం తెలుసుకోవాలని, సైబర్ మోసాలపై అవగాహన కలిగి ఉండాలని హెచ్చరిస్తోంది.