Property Rules: ఆస్తి మొత్తం కుమారుడి పేరుపై రాస్తే.. కూతురికి వాటా ఉండనట్లేనా..? ఈ రూల్స్ చాలామందికి తెలియదు..
ఆస్తి పంకాల విషయంలో వారసుల వద్ద వివాదాలు జరగడం సాధారణం. ఇటీవల ఎక్కడ చూసినా ఇలాంటివి చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఆస్తి కోసం సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగేవారు కూడా ఉన్నారు. దీనికి కారణం చట్టం గురించి స్పష్టంగా తెలుసుకోకపోవడమేనని చెప్పవచ్చు.

ఆస్తి పంపకాల విషయంలో తరచుగా భారతీయుల కుటుంబాల్లో గొడవలు జరుగుతుంటాయి. ఆస్తుల కోసం కొట్టుకోవడం, చంపుకోవడం లాంటివి చూస్తూ ఉంటాం. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముడు, అన్నాతమ్ముళ్ల మధ్య వివాదాలు చోటుచేసుకోవడం, కోర్టుల వరకు వెళ్లడం సాధారణంగా జరుగుతూ ఉంటాయి. భారత చట్టాల ప్రకారం తల్లిదండ్రుల ఆస్తిలో పురుషులతో సమానంగా మహిళలకు కూడా సమాన హక్కు ఉంటుంది. అయితే కుమారుడికి ఎక్కువ ఆస్తులు అప్పగించడం వల్ల వివాదాలు చెలరేగుతూ ఉంటాయి. కుమారుడు పేరు మీదనే తల్లిదండ్రులు మొత్తం ఆస్తి రాస్తే కూతురికి వాటా దక్కుతుందా..? లేదా? పెళ్లయిన తర్వాత కూడా కూతురు తన వాటా అడగవచ్చా? పూర్వీకుల ఆస్తిలో కూడా సమాన వాటా ఉంటుందా..? అనేది చాలామందికి తెలియదు. ఈ విషయాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఆస్తిని ఎవరికైనా అప్పగించవచ్చు..
పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి కాకుండా తమ కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తిని తల్లిదండ్రులు తమ ఇష్టానుసారం ఎవరికైనా రాసుకోవచ్చు. తమ సొంత కష్టంతో సంపాదించుకున్నారు కాబట్టి దీనిపై పూర్తి హక్కు తల్లిదండ్రులకు ఉంటుంది. దీంతో ఈ ఆస్తిని తమకు నచ్చినవారికి ఇచ్చుకోవచ్చు. కేవలం కుమారుడికి మాత్రమే తమ స్వార్జిత ఆస్తిని తల్లిదండ్రులు ఇవ్వాలనుకుంటే.. దీనిపై కూతురికి ఎలాంటి హక్కు ఉండదు. తమ ఆస్తిని తల్లిదండ్రులు గిఫ్ట్ డీడ్ లేదా వీలునామా ద్వారా కుమారుడికి మొత్తం అప్పగించవచ్చు. ఇలాంటి సమయంలో కుమార్తెలు ఏం చేయడానికి వీలుండదు.
పూర్వీకుల ఆస్తిలో కూతురికి వాటా..?
తల్లిదండ్రులు తమ కష్టార్జితంగా కాకుండా పూర్వీకుల నుంచి వారసత్వంగా ఆస్తి వస్తే రూల్స్ మరోలా ఉంటాయి. ఇలాంటి ఆస్తిలో కుమారుడితో పాటు కుమార్తెకు కూడా సమాన వాటా అనేది ఉంటుంది. కూతురికి పెళ్లి అయినా సరే పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిలో సగ భాగం పొందే హక్కు ఉంటుంది. ఇలాంటి ఆస్తిని తల్లిదండ్రులు కుమారుడి పేరుపై మొత్తం రాస్తే.. కూతురు కోర్టులను ఆశ్రయించి పొందే స్వేచ్చ ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రులు సొంతగా సంపాదించుకున్న ఆస్తికి సంబంధించి వీలునామా రాయకుండా మరణిస్తే.. ఆ ఆస్తిలో కుమార్తెకు కూడా సమాన వాటా లభిస్తుంది. చట్టబద్దమైన వారసులందరికీ సమాన భాగం దక్కుతుంది. ఏమైనా వివాదాలు ఉంటే కూమార్తెలు సివిల్ కోర్టును ఆశ్రయించి న్యాయం పొందవచ్చు. అయితే కొంతమందికి ఈ చట్టాల గురించి తెలియకపోతే గొడవ రాగానే కోర్టులను ఆశ్రయిస్తుంటారు. ముందే ఈ విషయాలు తెలుసుకుని కోర్టులను ఆశ్రయించడం వల్ల లాభం ఉంటుంది. హిందూ వారసత్వ చట్టాల ప్రకారం రూల్స్ ఇలా ఉన్నాయి.
