Personal Finance: తమ బ్యాంకు ఖాతాలో కస్టమర్లు కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేయని ఖాతాదారుల నుంచి బ్యాంకులు ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేస్తాయి. ఓ రకంగా బ్యాంకులకు ఈ ఛార్జీలే ఒకానొక పెద్ద ఆదాయ వనరుగా మారుతున్నాయి. కొన్ని ప్రత్యేక ఖాతాలకు మాత్రమే కనీస బ్యాలెన్స్ విషయంలో బ్యాంకులు మినహాయింపు కల్పిస్తాయి. తమ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేయని ఖాతాదారుల(సేవింగ్/కరెంట్ అకౌంట్స్) నుంచి ఛార్జీల రూపంలో ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) భారీగా వసూలు చేస్తోంది. 2020-21 సంవత్సరంలో కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేయని ఖాతాదారుల నుంచి పీఎన్బీ రూ.170 కోట్లు ఛార్జీలు వసూలు చేసింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. అయితే మునుపటి ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ తరహా ఛార్జీల ద్వారా పీఎన్బీకి వచ్చిన ఆదాయం కాస్త తగ్గింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ తరహా ఛార్జీలతో ఆ బ్యాంకు ఏకంగా రూ.286.24 కోట్లు ఆర్జించింది. ఆర్థిక సంవత్సరంలో ప్రతి త్రైమాసికంలో బ్యాంకులు ఈ తరహా ఛార్జీలను కస్టమర్ల ఖాతాల నుంచి వసూలు చేస్తాయి.
ఏటీఎం ట్రాన్సక్షన్స్పై ఛార్జీల రూపంలోనూ పీఎన్బీకి గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో భారీగానే ఆదాయం సమకూరింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.114.08 కోట్లు ఆదాయం రాగా.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.74.28 కోట్లు ఆర్జించింది. కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2020-21 ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసంలో ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలను ఎత్తివేయడంతో ఆ మేరకు పీఎన్బీ ఆదాయం తగ్గింది. మధ్యప్రదేశ్కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ ఆర్టీఐ చట్టం ద్వారా పీఎన్బీ నుంచి ఈ సమాచారం రాబట్టారు.
PNB
పీఎన్బీలో ఎన్ని ఖాతాలో ఆపరేటివ్లో ఉన్నాయి? ఎన్ని ఖాతాలు ఆపరేటివ్లో లేదన్న ప్రశ్నకు సమాధానమిచ్చిన పీఎన్బీ.. 13,37,48,857 ఖాతాలు ఆపరేటివ్లో ఉన్నట్లు తెలిపింది. 4,27,59,597 ఖాతాలు ఆపరేటివ్లో లేదని వెల్లడించింది.
Also Read..
Credit Score: క్రెడిట్ కార్డుల వల్ల క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుందా..? ఈ విధంగా పెంచుకోండి..!
Credit Card: ఈ బ్యాంకు క్రెడిట్ కార్డు తీసుకుంటే ఉచితంగా హెల్త్ చెకప్.. వీటిలో భారీ డిస్కౌంట్..!