Pension Scheme: నెలకు రూ.9,250 పెన్షన్.. పెట్టుబడిపై 7.40 శాతం వడ్డీ కూడా.. పథకం పూర్తి వివరాలివే..

|

Feb 15, 2023 | 6:19 PM

వృద్ధాప్యంలో సీనియర్ సిటిజన్లకు సామాజిక భద్రతను ఇవ్వడానికి, వారికి వడ్డీ ద్వారా ప్రతీ నెలా కొంత ఆదాయాన్ని అందించడానికి రూపొందించిన పెన్షన్ పథకమే.. ఈ పెన్షన్ స్కీమ్..

Pension Scheme: నెలకు రూ.9,250 పెన్షన్.. పెట్టుబడిపై 7.40 శాతం వడ్డీ కూడా.. పథకం పూర్తి వివరాలివే..
Pradhan Mantri Vaya Vandana Yojana
Follow us on

మన కేంద్ర ప్రభుత్వం 2017 సంవత్సరంలోనే ‘ప్రధాన మంత్రి వయ వందన యోజన(PMVVY)’ పథకాన్ని ప్రారంభించిన సంగతి మనందరికీ తెలిసిందే. మొదట్లో ఈ పథకం పెట్టుబడి లిమిట్ రూ.7.5 లక్షలు ఉండగా, 2018లో దానిని రూ.15 లక్షలకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. వృద్ధాప్యంలో సీనియర్ సిటిజన్లకు సామాజిక భద్రతను ఇవ్వడానికి, వారికి వడ్డీ ద్వారా ప్రతీ నెలా కొంత ఆదాయాన్ని అందించడానికి రూపొందించిన పెన్షన్ పథకం ఇది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) నిర్వహిస్తున్న ఈ పథకానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు గడువు తేదీని విధిస్తూ ఉంటుంది. ఆ క్రమంలోనే తాజా గడువు 2023 మార్చి 31 వరకే ఉంది. అయితే ప్రధాన మంత్రి వయ వందన యోజన పథకానికి వడ్డీని కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఈ స్కీమ్‌కు 7.40 శాతం వడ్డీని అందిస్తోంది ఎల్ఐసీ. అంటే ఈ స్కీమ్‌లో చేరడం ద్వారా గరిష్టంగా నెలకు రూ.9,250 వరకు పెన్షన్ పొందొచ్చు.

అయితే ఈ స్కీమ్‌లో కనీసం రూ.1,62,162 ఇన్వెస్ట్ లేదా డిపాజిట్ చేయాలి.  అలా చేసిన వారికి నెలకు రూ.1,000, మూడు నెలలకు రూ.3,000, ఆరు నెలలకు రూ.6,000, సంవత్సరానికి రూ.12,000 చొప్పున పెన్షన్ వస్తుంది. ఇంకా ఈ ప్రధాన మంత్రి వయ వందన యోజన పథకంలో గరిష్టంగా రూ.15,00,000 వరకు పొదుపు చేయవచ్చు. దీనిపై 7.40 శాతం చొప్పున వడ్డీ లెక్కిస్తే నెలకు రూ.9,250 పెన్షన్ లభిస్తుంది. 60 ఏళ్లు దాటిన భార్యాభర్తలు ఈ పెన్షన్ పథకంలో రూ.30,00,000 పొదుపు చేస్తే ఇద్దరికీ కలిపి రూ.18500 పెన్షన్ అందుతుంది. ఈ ఏడాది మార్చి 31 లోగా చేరేవారికే ఇంత మొత్తంలో పెన్షన్ లభిస్తుంది.

కాగా, రిటైర్మెంట్ సమయంలో వచ్చిన డబ్బుల్ని దాచుకొని ప్రతీ నెలా వడ్డీ పొందాలనుకునే వారికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆర్థిక నిపుణుల సలహా. లేదా పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చినప్పుడు వాటిని దాచుకొని ప్రతీ నెలా కొంత పెన్షన్ రూపంలో పొందాలనుకున్నా ఈ స్కీమ్‌లో చేరవచ్చని అంటున్నారు. ఇందులో చేరడానికి కనీస వయస్సు 60 ఏళ్లు. గరిష్ట వయస్సుకు ఎలాంటి పరిమితి లేదు. పాలసీ టెర్మ్ 10 ఏళ్లు. ఈ ప్రధాన మంత్రి వయ వందన యోజన పథకంలో చేరిన వారికి ప్రతీ నెల పెన్షన్ వస్తుంది. ఇలా 10 ఏళ్ల పాటు పెన్షన్ పొందవచ్చు. 10 ఏళ్ల తర్వాత మొదట చెల్లించిన మొత్తం తిరిగి వస్తుంది. ఒకవేళ పాలసీహోల్డర్ పాలసీ కొనసాగుతున్న సమయంలో మరణిస్తే..  నామినీకి ముందుగా జమ చేసిన మొత్తాన్ని చెల్లిస్తుంది ఎల్ఐసీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..