కొత్త రూల్స్‌ అమలులోకి..! పాన్‌ కార్డ్‌ ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు

ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చిన పాన్ కార్డు కొత్త నిబంధనలు దరఖాస్తు ప్రక్రియను, ఆర్థిక లావాదేవీలను ప్రభావితం చేస్తున్నాయి. పాన్ కోసం ఆధార్ తో పాటు అదనపు ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. పాన్‌పై పేరు ఆధార్‌తో సరిపోలాలి. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

కొత్త రూల్స్‌ అమలులోకి..! పాన్‌ కార్డ్‌ ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు
పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రోటీన్ ఇ-గవర్నమెంట్ టెక్నాలజీస్ లిమిటెడ్, యుటిఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్, ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. కొత్త ఫారమ్‌లు కూడా త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

Updated on: Apr 02, 2026 | 4:36 AM

దేశవ్యాప్తంగా పన్ను వ్యవస్థను మరింత పారదర్శకంగా, కట్టుదిట్టంగా మార్చే దిశగా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ పాన్ కార్డు సంబంధిత నిబంధనల్లో కీలక మార్పులను అమల్లోకి తీసుకొచ్చింది. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చిన ఈ కొత్త మార్గదర్శకాలు పాన్ దరఖాస్తు ప్రక్రియతో పాటు, ఆర్థిక లావాదేవీలలో పాన్ వినియోగాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం.. పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఇకపై కేవలం ఆధార్ కార్డు సరిపోదు. అభ్యర్థులు తమ వయస్సు, గుర్తింపును నిర్ధారించడానికి అదనపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో జనన ధృవీకరణ పత్రం, ఓటర్ ఐడి, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, 10వ తరగతి మార్క్‌షీట్ లేదా మేజిస్ట్రేట్ జారీ చేసిన అఫిడవిట్ వంటి పత్రాలు తప్పనిసరి అయ్యాయి. ఈ చర్య ద్వారా ఫేక్ లేదా డూప్లికేట్ పాన్ కార్డులను తగ్గించాలనే లక్ష్యం ఉందని అధికారులు చెబుతున్నారు.

అదేవిధంగా పాన్ కార్డుపై పేరు ఇకపై ఆధార్‌లో ఉన్న పేరుతో పూర్తిగా సరిపోవాల్సి ఉంటుంది. పేర్లలో తేడాలు ఉంటే దరఖాస్తులు తిరస్కరించే అవకాశముంది. ఈ మార్పుతో గుర్తింపు ప్రక్రియ మరింత కచ్చితత్వంతో జరుగుతుందని భావిస్తున్నారు. కొత్త పాన్ కోసం లేదా వివరాల అప్‌డేట్ కోసం ప్రోటీన్ ఇ-గవర్నమెంట్ టెక్నాలజీస్ లిమిటెడ్, యుటిఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్, ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా సేవలు అందుబాటులో ఉంటాయి. ఇక పాన్ వినియోగానికి సంబంధించిన నిబంధనలలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక బ్యాంకు ఖాతాలో సంవత్సరానికి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ లేదా ఉపసంహరణలు చేసినప్పుడు పాన్ అందించడం తప్పనిసరి అయ్యింది. గతంలో ఇది ఒకే రోజులో రూ.50,000 లావాదేవీలకు మాత్రమే వర్తించేది. వాహనం కొనుగోలు సమయంలో రూ.5 లక్షలకు మించిన విలువ ఉన్నప్పుడు మాత్రమే పాన్ అవసరం ఉంటుంది.

బీమా పాలసీల విషయంలో ప్రీమియం మొత్తంతో సంబంధం లేకుండా ప్రారంభ దశలోనే పాన్ సమర్పణ తప్పనిసరి చేశారు. అలాగే రూ.20 లక్షలకు మించిన స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకాల లావాదేవీలకు పాన్ తప్పనిసరి. హోటళ్లు, రెస్టారెంట్లు లేదా ఈవెంట్లలో రూ.1 లక్షకు మించిన నగదు చెల్లింపులకు కూడా పాన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తంగా ఈ కొత్త నిబంధనలు పెద్ద మొత్తంలో జరిగే ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించడాన్ని సులభతరం చేయడంతో పాటు, పన్ను ఎగవేతను నియంత్రించే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us