
ఎప్పుడో రెండేళ్లక్రితమే రద్దయిన 2 వేల నోట్లు..ఇంకా బ్యాంకులకు తిరిగి రాలేదంటే అవి ఎక్కడున్నట్లు? కొందరు వాటిని ఎందుకింకా దాచుకున్నట్లు? ఇప్పుడు వాటిని మార్చుకునే అవకాశం ఉందా..?
2వేల కరెన్సీ నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉపసంహరించుకుని దాదాపు 20 నెలలపైనే అయింది. చలామణిలో ఉన్నవాటిలో 98.18 శాతం నోట్లు తిరిగి బ్యాంకులకు చేరాయి. అయినా ఇంకా 6వేల 400 కోట్ల విలువైన 2వేల రూపాయల నోట్లు ప్రజల చేతుల్లోనే ఉన్నాయి. స్వయంగా రిజర్వు బ్యాంకాఫ్ ఇండియానే చెప్పిందీ విషయాన్ని. 2వేల నోటును ఉపసంహరించుకుంటున్నట్లు 2023 మే 19న ఆర్బీఐ ప్రకటించింది. ఆ నిర్ణయం వెలువడే నాటికి 3లక్షల 56 వేల కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయి.
2వేల రూపాయల నోట్లను తొలుత బ్యాంకుల్లో మార్చుకునేందుకు, డిపాజిట్ చేసేందుకు 2023 సెప్టెంబరు 30దాకా ప్రజలకు అవకాశం ఇచ్చారు. తర్వాత ఆ గడువును మరోవారం పొడిగించారు. ఆ తర్వాత నుంచి రద్దయిన 2వేల రూపాయల నోట్లను ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే స్వీకరిస్తున్నారు. అలా ఈ ఏడాది ఫిబ్రవరి 28దాకా 98.18 శాతం నోట్లు బ్యాంకులను చేరినట్లు ఆర్బీఐ వెల్లడించింది. అవగాహన లేక అనుకోడానికి లేదు. అఫీషియల్గా చూపించేందుకు ఇష్టపడనివారు కొందరు ఉండుండొచ్చు. అందుకే ఇంకా కొంతమేర 2వేల నోట్లు బ్యాంకులకు తిరిగిరాలేదని భావిస్తున్నారు.
ఇప్పటికీ ఆర్ఐబీ ప్రాంతీయ కార్యాలయాలలో నోట్ల మార్పిడి, డిపాజిట్కి అవకాశముందంటోంది రిజర్వ్బ్యాంక్. రీజనల్ ఆఫీసులకు చేరుకోలేనివారు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఆయా కార్యాలయాలకు పంపొచ్చు. దేశంలో హైదరాబాద్ సహా 18చోట్ల ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. రద్దయినా 2వేల నోట్లుచిత్తు కాగితాలేం కావు. అధికారికంగా మార్చుకునే ఆఫర్ని ఓపెన్గా ఉంచింది ఆర్బీఐ.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..