Bullet Train: జస్ట్ 3 గంటలే.. హైదరాబాద్ టూ ముంబయి.. ఇక బుల్లెట్ స్పీడ్తో దూసుకెళ్లడమే!
దేశంలో హైస్పీడ్ రైలు ప్రాజెక్టుల విస్తరణలో భాగంగా హైదరాబాద్–పుణె–ముంబయి బుల్లెట్ రైలు కారిడార్ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే సర్వే పూర్తవగా, తాజాగా డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) కూడా సిద్ధమైంది. ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నుంచి ముంబయికి కేవలం 3 గంటల్లో ప్రయాణం చేసే అవకాశం లభించనుంది.

ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ముంబయికి రోడ్డు మార్గంలో ప్రయాణానికి సుమారు 12 గంటలు, రైలులో దాదాపు 15 గంటల సమయం పడుతోంది. కానీ హైస్పీడ్ బుల్లెట్ రైలు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందించారు. దీంతో కనిష్ఠంగా 2 గంటల 55 నిమిషాలు, గరిష్ఠంగా 3 గంటల 13 నిమిషాల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ప్రతిపాదిత కారిడార్ మొత్తం పొడవు 671 కిలోమీటర్లు. ఇందులో తెలంగాణలో 93 కిలోమీటర్లు, కర్ణాటకలో 121 కిలోమీటర్లు, మహారాష్ట్రలో అత్యధికంగా 457 కిలోమీటర్ల మార్గం ఉండనుంది. మూడు రాష్ట్రాల మీదుగా ఈ ప్రాజెక్టు విస్తరించనుంది.
తెలంగాణలో కోకాపేట, వికారాబాద్ ప్రాంతాల్లో హైస్పీడ్ స్టేషన్లు ఏర్పాటు చేసే ప్రణాళిక ఉంది. తరువాత శంషాబాద్ సమీపంలో కూడా మరో స్టేషన్ అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. కర్ణాటకలో కలబురిగి, మహారాష్ట్రలో పుణె, థానే, నవీ ముంబయి, సోలాపూర్ సహా పలు ప్రాంతాల్లో స్టేషన్లు ఉండనున్నాయి.
ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో మరో ప్రత్యేకత భూగర్భ మార్గాలు. మహారాష్ట్ర పరిధిలో సుమారు 35 కిలోమీటర్ల మేర అండర్గ్రౌండ్ ట్రాక్ నిర్మించనున్నారు. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో సొరంగ మార్గాలు రూపొందించనున్నారు. ఖండాల ఘాట్ ప్రాంతంలో 13 టన్నెల్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయి.
హైస్పీడ్ స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఒక్కో స్టేషన్కు భవనాలు, పార్కింగ్, ఇతర సౌకర్యాల కోసం భారీ భూమి అవసరమవుతోంది. తెలంగాణలో కోకాపేట, వికారాబాద్ స్టేషన్ల కోసం దాదాపు 247 ఎకరాల భూమి అవసరమని అధికార వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఈ కారిడార్ మార్గంలో మొత్తం 101 వంతెనలు నిర్మించనున్నారు. వాటిలో 13 స్టీల్ వంతెనలు ఉంటాయి. పలు ప్రధాన నదులపై భారీ బ్రిడ్జిలు కూడా నిర్మించనున్నారు.
ప్రాజెక్టు ప్రారంభ దశలో రోజుకు సుమారు 63 వేల మంది ప్రయాణికులు ఈ రైలును ఉపయోగిస్తారని అంచనా. భవిష్యత్తులో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ముంబయి ప్రయాణాన్ని కొత్త దశలోకి తీసుకెళ్లే మెగా ప్రాజెక్టుగా ఇది మారనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
