AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇరాన్‌ vs అమెరికా యుద్ధం.. భారత్‌లోని ఆ రైతులకు తీవ్ర నష్టం!

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం భారత్ బాస్మతి ఎగుమతులను కుదిపేస్తోంది. మధ్యప్రాచ్య దేశాలపై అధికంగా ఆధారపడిన ఈ రంగం, చెల్లింపుల ఆలస్యం, సరుకుల నిలిపివేతతో సంక్షోభంలో ఉంది. దాదాపు 72 శాతం బాస్మతి ఎగుమతులు ఈ ప్రాంతానికే వెళ్తుండగా, ప్రస్తుత అస్థిరత రైతులు, ఎగుమతిదారులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఇరాన్‌ vs అమెరికా యుద్ధం.. భారత్‌లోని ఆ రైతులకు తీవ్ర నష్టం!
India Basmati Exports
SN Pasha
|

Updated on: Mar 04, 2026 | 6:00 AM

Share

ఇరాన్ వర్సెస్‌ ఇజ్రాయెల్, అమెరికా యుద్ధభూమిని దాటి వాణిజ్య రంగాన్నీ కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశ బాస్మతి బియ్యం ఎగుమతులపై దీని ప్రభావం కనిపించడం ప్రారంభమైంది. మధ్యప్రాచ్య దేశాలపై అధిక ఆధారపడిన ఈ రంగంలో ఎగుమతిదారులు, రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. భారత్‌ మొత్తం బాస్మతి ఎగుమతుల్లో సుమారు 72 శాతం మధ్యప్రాచ్య దేశాలకే వెళ్తోంది. ఈ ప్రాంతంలో అస్థిరత కొనసాగితే ఎగుమతులు తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వందల కోట్ల రూపాయల విలువైన సరుకులు పోర్టుల వద్ద నిలిచిపోవడంతో పాటు చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి.

పంజాబ్ బాస్మతి బియ్యం ఎగుమతిదారుల సంఘం (PBREA) డైరెక్టర్ అశోక్ సేథి మాట్లాడుతూ.. మధ్యప్రాచ్యంలో బిర్యానీ వంటి వంటల కోసం భారత బాస్మతికి భారీ డిమాండ్ ఉందన్నారు. అయితే ప్రస్తుత భౌగోళిక ఉద్రిక్తతలు మొత్తం వాణిజ్యాన్ని అనిశ్చితిలోకి నెట్టాయని తెలిపారు. ఎక్కువగా క్రెడిట్‌పై జరిగే ఈ ఎగుమతుల్లో చెల్లింపులు ఆలస్యం కావడం పెద్ద ప్రమాదమని ఎగుమతిదారులు భావిస్తున్నారు. 2024–25లో భారత్ 60.65 లక్షల మెట్రిక్ టన్నుల బాస్మతిని ఎగుమతి చేసి రూ.50,312 కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించింది. ఇందులో రూ.36,139 కోట్లు మధ్యప్రాచ్య దేశాల నుంచే రావడం ఈ మార్కెట్ ప్రాముఖ్యతను చూపుతోంది. సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్, యూఏఈ, యెమెన్ దేశాలు కలిసి మొత్తం ఎగుమతుల్లో 67 శాతం వాటా కలిగి ఉన్నాయి.

ప్రత్యేకంగా ఇరాన్ దిగుమతులు గత కొన్ని సంవత్సరాలుగా తగ్గుముఖం పట్టాయి. 2018–19లో 14.83 లక్షల టన్నులు కొనుగోలు చేసిన ఇరాన్, 2024–25 నాటికి 8.55 లక్షల టన్నులకు తగ్గించింది. తాజా నిరసనలు, యుద్ధ పరిస్థితులు మరింత ప్రభావం చూపవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎగుమతి క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ద్వారా చెల్లింపు హామీలు కల్పించాలని ఎగుమతిదారులు కేంద్రాన్ని కోరుతున్నారు. డిమాండ్ పడిపోతే ధరలు తగ్గి రైతుల ఆదాయం నేరుగా దెబ్బతింటుందని వారు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us