దేశంలో చమురు నిల్వ ఎంత? ఎన్ని రోజులకు సరిపోతుందో కేంద్రం క్లారిటీ! ఆ లెక్కులు ఇవే
భారతదేశ వ్యూహాత్మక చమురు నిల్వలు ప్రస్తుతం 64 శాతం నిండి ఉన్నాయి. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు, సరఫరా అంతరాయాల ఆందోళనల నేపథ్యంలో ఇది దేశ ఇంధన భద్రతకు కీలకం. ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు వినియోగదారుగా, భారత్ తన అవసరాల్లో 88 శాతం దిగుమతి చేసుకుంటుంది.

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో సరఫరా అంతరాయాల నుంచి రక్షణగా నిలిచే భారతదేశ వ్యూహాత్మక చమురు నిల్వలు ప్రస్తుతం సుమారు 64 శాతం సామర్థ్యంతో నిండి ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇస్తూ పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి, ఈ నిల్వలను నిర్వహిస్తున్న ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ వద్ద సుమారు 3.372 మిలియన్ టన్నుల ముడి చమురు నిల్వ ఉందని తెలిపారు.
ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఇంధన వినియోగదారుగా ఉన్న ఇండియా, తన అవసరాల్లో దాదాపు 88 శాతం ముడి చమురును దిగుమతుల ద్వారా తీర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, కర్ణాటకలోని మంగళూరు, పడూర్ ప్రాంతాల్లో మొత్తం 5.33 మిలియన్ టన్నుల సామర్థ్యంతో భూగర్భ నిల్వలను ఏర్పాటు చేసింది. ఈ నిల్వలు డైనమిక్ రిజర్వ్ గా నిర్వహించబడుతున్నాయని, మార్కెట్ పరిస్థితులు, వినియోగాన్ని బట్టి నిల్వల పరిమాణం మారుతూ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా సరఫరా అంతరాయాలపై ఆందోళనలు పెరిగాయి. భారతదేశం దిగుమతి చేసుకునే చమురు, గ్యాస్, ఎల్పిజిలో గణనీయమైన భాగం ఈ మార్గం ద్వారానే వస్తోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి 11 నెలల్లో భారత్ సుమారు 226 మిలియన్ టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకోవడానికి 110 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. ఇందులో గణనీయమైన భాగం సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ వంటి దేశాల నుండి వచ్చింది. ఇక నిల్వ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒడిశాలోని చండిఖోల్, కర్ణాటకలోని పడూర్లో మరో 6.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో కొత్త నిల్వలను అభివృద్ధి చేస్తున్నారు. అదనంగా అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ADNOC)తో ఒప్పందం కుదుర్చుకుని మంగళూరులోని నిల్వలను వాణిజ్యపరంగా వినియోగించే అవకాశం కల్పించారు. ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న మొత్తం నిల్వలు దేశ అవసరాలను సుమారు 74 రోజుల పాటు తీర్చగలవని ప్రభుత్వం తెలిపింది. ఒకే ప్రాంతంపై ఆధారపడకుండా, భారత్ 41 దేశాల నుండి చమురును దిగుమతి చేసుకుంటూ సరఫరా వనరులను వైవిధ్యపరుస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
