
Indian Railways: భారతదేశంలో ప్రతిరోజూ కోట్ల మంది ప్రజలు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. అయితే సుదూర ప్రయాణాలు చేసేటప్పుడు స్లీపర్ క్లాస్ లేదా థర్డ్ ఏసీ (3AC) లలో చాలా మందికి “మిడిల్ బెర్త్” సీటు వస్తుంటుంది. రైలు ప్రయాణంలో అత్యధికంగా వివాదాలు జరిగేది కూడా ఈ మిడిల్ బెర్త్ సీటును ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం గురించే. పగటిపూట కూడా కొందరు మిడిల్ బెర్త్ ఓపెన్ చేసి పడుకోవడం వల్ల లోయర్ బెర్త్ (క్రింది సీటు) ప్రయాణికులకు కూర్చోవడానికి వీలుండదు. ఈ సమస్యలను నివారించడానికి భారతీయ రైల్వే స్పష్టమైన ‘స్లీపింగ్ అవర్స్’ నియమాలను అమలు చేస్తోంది. ఆ నిబంధనలేంటో ఇప్పుడు చూద్దాం.
రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం, రిజర్వ్డ్ కోచ్లలో ప్రయాణించే వారు రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 6:00 గంటల వరకు మాత్రమే మిడిల్ బెర్త్ను తెరిచి నిద్రపోవడానికి అనుమతి ఉంటుంది. ఉదయం 6:00 గంటలు కాగానే మిడిల్ బెర్త్ను ఫోల్డ్ (మడతబెట్టి) చేసి కిందకి దించాలి. తద్వారా లోయర్ బెర్త్, మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్ ప్రయాణికులు అందరూ లోయర్ బెర్త్పై సౌకర్యవంతంగా కూర్చోవడానికి వీలుంటుంది.
ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు మిడిల్ బెర్త్ ప్రయాణికుడు సీటును ఓపెన్ చేసి పడుకోవడానికి చట్టబద్ధమైన హక్కు లేదు. ఒకవేళ పగటిపూట పడుకోవాలనుకుంటే లోయర్ బెర్త్ ప్రయాణికుడి అనుమతి (మ్యూచువల్ అండర్స్టాండింగ్) ఖచ్చితంగా ఉండాలి. లోయర్ బెర్త్ ప్రయాణికుడు అభ్యంతరం చెబితే పగటిపూట సీటును ఫోల్డ్ చేయాల్సిందే.
రైల్వే నిబంధనల ప్రకారం.. ప్రయాణికుల్లో గర్భిణీ స్త్రీలు, అనారోగ్యంతో ఉన్నవారు, దివ్యాంగులు (వికలాంగులు) లేదా వృద్ధులు ఉంటే, వారు నిర్ణీత సమయం కంటే ఎక్కువ సమయం నిద్రపోవడానికి తోటి ప్రయాణికులు సహకరించాలని రైల్వే కోరుతోంది.
ఎవరైనా ప్రయాణికుడు ఉదయం 6 గంటల తర్వాత కూడా మిడిల్ బెర్త్ ఫోల్డ్ చేయకుండా మొండికేస్తే లేదా రాత్రి 10 గంటల కంటే ముందే బలవంతంగా సీటు ఓపెన్ చేస్తే, మీరు సదరు కోచ్లోని TTE (టికెట్ కలెక్టర్) లేదా కోచ్ అటెండెంట్కు ఫిర్యాదు చేయవచ్చు. రైల్వే నిబంధనల ప్రకారం TTE సదరు ప్రయాణికుడికి నచ్చజెప్పి సీటును ఫోల్డ్ చేయిస్తారు.
ఇది కూడా చదవండి: LPG Cylinder: గ్యాస్ ఎంత ఉందో బయటి నుంచే చూడొచ్చు.. సరికొత్త సిలిండర్ వచ్చేసింది!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి