
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో చైనా సీసీటీవీ కెమెరా అమ్మకాలను నిలిపివేసింది. భద్రతా కారణాల దృష్ట్యా సీసీటీవీ కెమెరాల విక్రయంపై కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ నియమాల ప్రకారం చైనా కంపెనీలు భారత్లో ధృవీకరణ లేకుండా తమ ప్రొడక్ట్స్ను విక్రయించకూడదు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. చైనా కంపెనీలు తయారుచేసిన ఇంటర్నెట్ అనుసంధానిత సీసీటీవీ కెమెరాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. నిఘా గురించి ఆందోళనలు, జాతీయ భద్రత, డేటా సెక్యూరిటీ, సున్నితమైన మౌలిక సదుపాయాలపై నిఘా గురించి ఆందోళన క్రమంలో కేంద్రం ఈ చర్య తీసుకుంది.
ఇక నుంచి భారత్లో సీసీటీవీ కెమెరాలు లేదా ఇతర సెక్యూరిటీ కెమెరాలను విక్రయించాలంటే కఠినమైన నిబంధనలు ఉంటాయి. ప్రభుత్వ ధృవీకరణ ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయంతో హిక్ విజన్, దహువా, టీపీ లింక్ వంటి చైనా కంపెనీలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఎయిర్పోర్ట్లు, ప్రభుత్వ ఆఫీసులు, రైల్వే స్టేషన్లు, ఇతర సున్నితమైన ప్రదేశాల్లో భద్రతను పర్యవేక్షించేందుకు సీసీటీవీ కెమెరాలు ఉపయోగపడుతున్నాయి. అయితే చైనా ప్రొడక్ట్స్ వల్ల డేటా చోరీ, నిఘా ఉల్లంఘనలతో పాటు భద్రతకు ముప్పు కలిగిస్తాయనే ఆందోళనల సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇక నుంచి చైనా పరికరాలపై నిషేధం అమల్లోకి వచ్చింది. జాతీయ భద్రతా వ్యవస్థలు కేవలం విశ్వసనీయమైన నెట్ వర్క్లపై మాత్రమే ఆధారపడాలని ప్రభుత్వం తెలిపింది.
ఎలక్ట్రానికస్, ఇన్పర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఏప్రిల్ 2024లో కొత్త నిబంధనలు జారీ చేసింది. ఈ రూల్స్ ప్రకారం స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ విధానం అమలు చేస్తోంది. దీని ద్వారా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రభుత్వం దగ్గర ధృవీకరించుకోవడానికి రెండేళ్ల సమయం కల్పిస్తారు. తమ ఉత్పత్తులు, సిస్టమ్ ఆన్ చిప్ వంటి కీలక భాగాల గురించి ప్రభుత్వానికి సమాచారం అందించాలి. ప్రభుత్వం గుర్తింపు పొందిన ల్యాబ్లలో హ్యాకింగ్, డేటా లీక్, రిమోట్ యాక్సెస్ వంటి లోపాల గురించి టెస్టింగ్ చేయాలి. ఇప్పటివరకు 500కిపైగా సీసీటీవీ మోడళ్లకు ఆమోదం ఇచ్చారు. అయితే విదేశీ కంపెనీలు ఈ ప్రమాణాలను అందుకోవడంలో కాస్త వెనక పడ్డాయి.