
Post Office: ప్రజలు తమ వద్ద ఉన్న డబ్బుతో లాభాలను ఆర్జించడానికి ప్రభుత్వ పథకాలపై ఎక్కువగా ఆధారపడుతారు. సాధారణంగా ప్రజలు డబ్బు జమ చేయడానికి బ్యాంకులలో ఖాతా తెరుస్తారు. చాలా మంది పొదుపు ఖాతా తెరిచి ఇందులో డబ్బులు సేవ్ చేస్తుంటారు. అయితే పోస్టాఫీసు కూడా అనేక రకాల పొదుపు పథకాలను అమలు చేస్తుంది. బ్యాంకులలో కంటే ఇక్కడ పెట్టుబడి పెడితే వడ్డీ కూడా ఎక్కువగా వస్తుంది. అంతేకాదు మీ డబ్బులకు పూర్తి భద్రత కూడా ఉంటుంది. అయితే మీరు పోస్టాఫీసు నియమాలను మాత్రం కచ్చితంగా పాటించాలి. అందులో ఖాతా తెరిచిన తర్వాత కచ్చితంగా మీరు ఈ తప్పులు చేయవద్దు.
1. పొదుపు ఖాతాలో ఈ తప్పులు చేయవద్దుమీరు పోస్టాఫీసులో పొదుపు ఖాతాను తెరిచినట్లయితే కచ్చితంగా లావాదేవీలు చేస్తూనే ఉండాలి. మూడేళ్ల పాటు ఎటువంటి లావాదేవీలు చేయకపోతే నిబంధనల ప్రకారం మీ ఖాతా పనిచేయదు. అప్పుడు మీరు పోస్టాఫీసు పొదుపు ఖాతాకు సంబంధించిన సేవలను పొందలేరు.
2. కనీస బ్యాలెన్స్ రూ.500
పోస్టాఫీసులో మీ పొదుపు ఖాతా చురుకుగా ఉండాలంటే మీరు కనీస బ్యాలెన్స్ రూ.500 మెయింటెన్ చేయాలి. లేదంటే మీ ఖాతా నుంచి మెయింటనెన్స్ చార్జీలుగా రూ.100 తీసివేస్తారు. తర్వాత కూడా మీరు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయకపోతే మీ ఖాతా మూసివేస్తారు. అందువల్ల కనీస బ్యాలెన్స్ని మెయింటెన్ చేయడం తప్పనిసరి.
3. జాయింట్ అకౌంట్ ఉంటే ఈ విషయం తెలుసుకోండి..
పోస్టాఫీసులో జాయింట్ అకౌంట్ ఉన్నప్పుడు ఖాతాదారులలో ఒకరు మరణిస్తే మిగిలిన వ్యక్తి ఆ ఖాతా హోల్డర్ అని గుర్తించండి. మీరు ఈ విషయాన్ని పోస్టాఫీసులో తెలియజేయాలి. అంతేకాదు ఖాతా తెరిచేటపుడు నామినీ పేరును కచ్చితంగా సబ్మిట్ చేయాలి.